ఇంకో స్టాండప్ కమెడియన్‌ కు వార్నింగ్

కామెడీ షోల పేరు చెప్పి.. ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే నడవదు ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందా.. ఆయా హీరోలు, రాజకీయ నాయకుల అభిమానులు వెతుక్కుని మరీ వచ్చి దాడి చేస్తున్నారు.

ఇటీవల ఇలాంటి పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ మధ్యే అనుదీప్ కటికల అనే కమెడియన్ హైదరాబాద్‌‌లో ఒక కామెడీ షో సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో పాటు కొణిదెల నిహారికల వ్యక్తిగత జీవితాల గురించి అవాకులు చెవాకులు పేలి.. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.

ఆ షో జరిగే చోటికి మెగా అభిమానులు వెళ్లి పెద్ద గొడవే చేశారు. తన అదృష్టం కొద్దీ ఆ కమెడియన్ వారి చేతికి చిక్కలేదు. లేదంటే అతడి పరిస్థితి ఏమయ్యేదో. మరోవైపు ఒక జనసైనికుడు పెట్టిన కేసు మేరకు ఏపీ పోలీసులు ఏకంగా ప్రయాగ్‌రాజ్ వరకు వెళ్లి ఆ కమెడియన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఐతే పవన్ ఫ్యాన్స్ చూపించిన పౌరుషం చూసి.. ఇప్పుడు టీడీపీ అభిమానుల్లోనూ వేడి పుట్టింది.

ఉదయ్ అనే మరో కమెడియన్ ఏడాదిన్నర ముందు చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పుడు అతడి మీద దాడికి ప్రయత్నించారు టీడీపీ ఫ్యాన్స్. ఈ కమెడియన్.. 2024 డిసెంబర్లో జరిగిన ఒక కామెడీ షోలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు-మంత్రి నారా లోకేష్‌ల మీద వెటకారపు వ్యాఖ్యలు చేశాడు.

చంద్రబాబు గతంలో అలిపిరిలో జరిగిన నక్సలైట్ దాడి నుంచి తప్పించుకోవడం గురించి వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అలాగే ఆయన లడ్డు వ్యవహారంలో దొరికిపోయాడని వ్యాఖ్యానించాడు. అలాగే లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడంటూ కామెంట్లు చేశాడు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఇప్పుడు టీడీపీ ఫ్యాన్స్.. ఉదయ్ మీదికి దాడికి వెళ్లారు. ఈ ఘటన చోటు చేసుకుంది బెంగళూరులోని కోరమంగళలో కావడం గమనార్హం. అక్కడ ‘మినిస్ట్రీ ఆఫ్ కామెడీ’ అనే స్టాండప్ కామెడీ షోలు జరిగే ప్లేస్‌కు వెళ్లి.. ఉదయ్ మీద దాడి చేయబోయారు టీడీపీ మద్దతుదారులు.

అతడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అప్పటికప్పుడు తనతో సారీ చెప్పించారు. తాను గతంలోనే తన వ్యాఖ్యలపై సారీ చెప్పానని ఉదయ్ అన్నా కూడా టీడీపీ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. పట్టుబట్టి ఒకటికి రెండుసార్లు సారీ చెప్పించారు. వీళ్లు తననేం చేస్తారో అని ఉదయ్ బాగా కంగారుపడ్డాడు. ఐదు నిమిషాల తర్వాత వాళ్లు వెళ్లిపోవడంతో యథావిధిగా తన షోను ఉదయ్ కొనసాగించాడు.