వీర్రాజు దూకుడుకు కారణం ఇదేనా ?

బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి సోము వీర్రాజులో ఒక్కసారిగా దూకుడు పెరిగిపోయింది. నిజానికి బీజేపీ దూకుడంతా వీర్రాజు మాటల్లోనే కనిపిస్తోంది కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం లేదన్న విషయం అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయంలో కూడా వీర్రాజు ఎందుకింత దూకుడు ప్రదర్శిస్తున్నారు ? ఎందుకంటే తెలంగాణా బీజేపీకి ఏమాత్రం తీసిపోకూడదన్న ఏకైక టార్గెట్ తోనే వీర్రాజు పనిచేస్తున్నట్లు కమలంపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

నిజానికి పార్టీ పరంగా చూస్తే తెలంగాణాకు ఏపికి ఏమీ పోలికలేదనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ మొదటి నుండి ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలో గట్టిగా ఉంది. చాలా కాలంగా సికింద్రాబాద్ ఎంపిని కమలంపార్టీ గెలుచుకుంటోంది. ఒకసారి ఓడిపోయినా మరో ఎన్నికల్లో గెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలవకపోయినా లోక్ సభకు మాత్రం కమలంపార్టీ చెప్పుకోదగ్గ ఓట్లను తెచ్చుకుంటోంది కాబట్టి.

ఈ కారణంగానే అప్పుడప్పుడైనా బీజేపీ సికింద్రాబాద్ లోక్ సభలో గెలుస్తోంది. ఒకపుడు బండారు దత్తాత్రేయ గెలిచేవారు. ఇపుడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి గెలిచారు. అలాగే గ్రేటర్ పరిధిలో కూడా అక్కడక్కడ బీజేపీ ఎంఎల్ఏలు గెలుస్తునే ఉన్నారు. కాకపోతే ఇపుడు బండి సంజయ్ వ్యవహార శైలి వల్ల పార్టీకి ఒక్కసారిగా ఊపొచ్చింది. దాంతోపాటు కాలం కూడా కలిసొచ్చి దుబ్బాక ఉపఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించింది. కాబట్టి తెలంగాణాలో బండి ఏమి మాట్లాడినా చెల్లుబాటైపోతోంది.

ఇక ఏపి విషయానికి వస్తే దేశమంతా బీజేపీ గాలి వీచినపుడు మాత్రమే ఎక్కడైనా ఎంపిలు లేకపోతే ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తోంది. 2014లో నరేంద్రమోడి గాలితోనే రెండు ఎంపి సీట్లు, నాలుగు ఎంఎల్ఏ సీట్లు గెలిచింది. అంతకుముందు అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధం గాలిలో వాజ్ పేయి హయాంలో గెలిచిందంతే. మొన్నటి మోడి గాలిలో ఇతర రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించినా ఏపిలో మాత్రం ఒక్కసీటులోను గెలవలేదు.

ఇలాంటి పార్టీకి అధ్యక్షునిగా ఉన్న వీర్రాజు వ్యక్తిగా తాను మాత్రం దూకుడు మీదున్నారు. పైగా తెలంగాణాలో పార్టీతో పోల్చి చూసుకుంటున్నట్లు కమలనాదులే చెబుతున్నారు. తెలంగాణాలో పార్టీ దూకుడు మీదున్నట్లే ఏపిలో కూడా దూకుడుతో పరిగెత్తించాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. జాతీయస్ధాయిలో కూడా ఏపిని తెలంగాణాతో పోల్చి చూస్తున్నారట. దాంతో వీర్రాజుపై అనివార్యంగా తెలంగాణా ఒత్తిడి పెరిగిపోతుందని సమాచారం. అందుకనే తానే కాకుండా పార్టీని కూడా పరుగులు పెట్టించాలని ప్రయత్నిస్తున్నారు. మరి సాధ్యమేనా ?