అజహరుద్దీన్ మినిస్ట్రీపై వీడిన సస్పెన్స్

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నామినేషన్లను గవర్నర్ ఆమోదించలేదు. మరోవైపు, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రిగా అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలు పూర్తి కావస్తోంది. అజ్జు భాయ్ మంత్రి పదవి చేపట్టి ఈ ఏప్రిల్ 30 నాటికి 6 నెలలు పూర్తవుతుంది.

ఈ లోపు ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే మంత్రి పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది. ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డికి చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాతో రేవంత్ భేటీ అయ్యారు. అజారుద్దీన్, కోదండరామ్‌ల ఎమ్మెల్సీ నామినేషన్ ఫైల్‌ను ఆమోదించాలని గవర్నర్ శుక్లాకు విజ్ఞప్తి చేశారు. అయితే, గవర్నర్ ఆ ఇద్దరికీ లైన్ క్లియర్ చేస్తారా లేదా అన్న విషయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది.

ఆ సస్పెన్స్ కు తెర దించుతూ అజహరుద్దీన్, కోదండరాంలకు గవర్నర్ శుక్లా పచ్చజెండా ఊపారు. రేవంత్ కేబినెట్ ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శుక్లా సంతకం చేశారు. త్వరలోనే అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఒక వేళ ఏప్రిల్ 30లోపు ఆ ఇద్దరి నామినేషన్ ను గవర్నర్ శుక్లా ఆమోదించకుంటే అజహరుద్దీన్ తో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా రేవంత్ ఆలోచించారట. ఆ అవసరం లేకుండానే మార్గం సుగమం కావడంతో రేవంత్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నాయి.