ఈ `ఐక్య‌త` కొన‌సాగితే.. మోడీకి క‌ష్ట‌మే!

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి ఐక్య‌తపై త‌ర‌చుగా అనేక చ‌ర్చ‌లుజ‌రుగుతున్నాయి. నిజానికి గ‌త 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందే.. ఇండియా కూట‌మి ఏర్పడింది. ప్ర‌ధాని మోడీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే జ‌రిగింది. అయితే.. ప‌ద‌వులు.. పంప‌కాల విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీల మ‌ధ్య నెల‌కొన్ని విభేదాల కార‌ణంగా.. ఈ ఐక్య‌త గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నేతిబీరను త‌ల‌పించింది.

ఇక‌, రాష్ట్రాల స్థాయిలో జ‌రిగిన‌, జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఈ ఐక్య‌త క‌నిపించ‌డం లేదు. ప్రాంతీయ పార్టీలు త‌మ త‌మ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిప‌త్యాన్ని స‌హించ‌డం లేదు. పైగా.. త‌మదే పైచేయిగా ఉండాల‌ని.. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్.. వంటివి కోరుకుంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నా.. కేంద్ర స్థాయిలో మాత్రం క‌లివిడిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఈ కార‌ణంగానే 2024 ఎన్నిక‌ల అనంత‌రం.. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు మాత్ర‌మే వ‌చ్చినా.. లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడిగా రాహుల్‌ను ఏక‌గ్రీవంగా కూట‌మి ఎంపిక చేసుకుంది.

ఇక‌, ఆ త‌ర్వాత కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఇండియా కూట‌మిపై అనుమానాలు తొల‌గిపోలేదు. కానీ.. ఇటీ వ‌ల మ‌హిళా బిల్లు పేరుతో కేంద్రం తీసుకువ‌చ్చిన 131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు ద్వారా డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టే విష‌యంలో ఐక్య‌త ప్ర‌ద‌ర్శించాయి. వాస్త‌వానికి ఈ `ఐక్య‌త‌`ను బీజేపీ అంచ‌నా వేయ‌లేక పోయింది. ముఖ్యంగా అనైక్య‌త‌పైనే న‌మ్మ‌కం పెట్టుకుంది. డీఎంకే స‌హా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలు.. ఎన్నిక‌ల వేళ ఈ బిల్లుకు ఖ‌చ్చితంగా ఓకే చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని బీజేపీ భావించింది.

కానీ.. ఆయా పార్టీలు కూడా.. ఇండియా కూట‌మి ఆలోచ‌న‌కు మ‌ద్దతుగా నిలిచాయి. ఈ విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని తెలిసినా.. కూడా ఇండీ కూట‌మిలో ఎక్క‌డా తేడా రాకుండా.. రాహుల్‌గాంధీ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించారు. మిత్ర‌ప‌క్షాల‌తో వ‌రుస‌గా రెండు సార్లు భేటీ అయ్యారు. ఇలా.. ఈ బిల్లు విష‌యంలో ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో ఇండియా కూట‌మి స‌క్సెస్ అయింది.

ఫ‌లితంగా బీజేపీ ప‌రాజ‌యం పాలైంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఈ మ‌ద్ద‌తు.. ఈ ఐక్య‌త కొన‌సాగితే.. మోడీ గెలుపు క‌ష్ట‌సాధ్య‌మేన‌ని అంటున్నారు నిపుణులు. అయితే.. ఈ ఐక్య‌త తాజాగా జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.