టీడీపీలో లోకేష్ శ‌కం… ఇక కథ వేరుంటది

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ను నియమించారు. వాస్తవానికి ఈ పదవిపై గత రెండు సంవత్సరాలుగా చర్చ నడుస్తూనే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ పరంగా కీలక బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగిస్తారని ఒక వాదన నడిచింది. ఈ క్రమంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టిస్తారని, రెండేళ్ల కిందటే పార్టీ వర్గాల్లో చర్చ వచ్చింది.

తాజాగా ఈ పదవిని సృష్టించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి హడావిడి లేకుండా ఎటువంటి ముందస్తు ప్రకటనలు చేయకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ప్రకటించడం విశేషం. సో దీనిని బట్టి ఇక పార్టీలో లోకేష్ శ‌కం ప్రారంభం అయినట్టేనని సీనియర్లు చెబుతున్నారు. ఆది నుంచి పార్టీలో క్రమశిక్షణ, అదేవిధంగా కొన్ని సిద్ధాంతాలకు లోబడి నాయకులు పనిచేస్తూ ఉన్నారు. రాజకీయపరమైన అవకాశాలు కావచ్చు.. అవసరాలతో కావచ్చు కొంతమంది నాయకులను తీసుకున్నారు.

వారి వల్ల పార్టీ దెబ్బతింటోందని ఇటీవ‌ల కాలంలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతకు పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ ను నియమించడం ద్వారా యువతకు పెద్దపీట వేసే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇక లోకేష్ వ్యవహార శైలిని గమనిస్తే ముక్కు సూటిగా వ్యవహరించడంతోపాటు పార్టీ నాయకులు దారి తప్పుతున్నారని గమనిస్తే ఆయన నిర్మొహమాటంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇటీవల అనేక మంది ఎమ్మెల్యేలను పిలిచి వారికి పార్టీ విధానాలపై స్పష్టత ఇచ్చారు. ప్రజలతో మమేకం కావాలని సొంత వ్యవహారాలను పక్కన పెట్టాలని పార్టీని రాజకీయంగా డెవలప్ చేయాలి తప్ప ఆర్థికంగా ఉపయోగించుకుంటే సహించేది లేదని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో నాయకులు కొంత అలెర్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు అధికారికంగా పార్టీలో ఆయనకు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ స్థానం వచ్చేసింది. ఇక దాదాపు ఆయన క‌నుస‌న్న‌ల్లోనే పార్టీ సాగుతుందనే వాదన వినిపిస్తోంది.

గత ఎన్నికల సమయంలో కూడా 40 మంది.. లోకేష్ సూచించిన నాయకులకు టికెట్లు ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో లోకేష్ కు బాధ్యతలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని తాజా ప్రరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఫలితంగా త‌ప్పులు చేసేవారి విష‌యంలో ఇప్పటివరకు చంద్రబాబు మాదిరిగా చూసి చూడన‌ట్టు పోవడం లేదా సమయం ఇచ్చి.. మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కల్పించడం వంటివి ఇకపై ఉండకపోవచ్చు.

తప్పులు చేసే వారిని కఠినంగా పక్కన పెట్టే అంశం నారా లోకేష్ కొన్నాళ్లుగా పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చిందులు తొక్కే నాయకులకు గట్టిగానే జవాబు చెప్పే అవకాశం ఉంటుంది. వారిని లైన్లో పెట్టే అవకాశం కూడా లభించనుంది. మొత్తంగా పార్టీలో సమూల ప్రక్షాళన అయితే జరుగుతుంది. ఇప్పటిలాగా ఉన్నట్టు నాయకులు వ్యవహరిస్తే అయ్యే ప‌ని  కాదనేది స్పష్టం అవుతోంది.