రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన ఎంపీలు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు స‌హా.. ప‌లువురితో క‌లిసి ఆయ‌న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. అనంత‌రం.. రాష్ట్ర‌ప‌తి గౌర‌వార్థం.. మంగ‌ళ‌గిరి చేనేత చీర‌ల గిఫ్టు ప్యాక్‌ను అందించారు. అంతేకాదు.. అర‌కు కాఫీ గిఫ్టు ప్యాక్‌ను  కూడా బ‌హూకరించారు.

అదేస‌మ‌యంలో తాను రాసిన పుస్త‌కం.. `యువ‌గ‌ళం` సంచికను కూడా రాష్ట్ర‌ప‌తికి అందించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటీవ‌ల పార్ల‌మెంటు ఉభ‌య స‌భలు.. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లును పాస్ చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కేవ‌లం 24 గంట‌ల్లోనే రాష్ట్ర‌ప‌తి ఈ బిల్లుపై సంత‌కం చేశారు. దీంతో అమ‌రావ‌తి రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త చేకూరింది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని లోకేష్.. పార్టీ ఎంపీల‌తో క‌లిసి రాష్ట్ర‌ప‌తిని క‌లుసుకున్నారు.

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించినందుకు రాష్ట్ర‌ప‌తికి నారా లోకేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త‌ల‌తో పాటు.. అమ‌రావతి ప్ర‌త్యేక‌త‌లు కూడా వివ‌రించారు. రాజ‌ధాని ప‌నులు ఎలా సాగుతున్నాయో వివ‌రించారు. ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రంగా దీనిని తీర్చిదిద్దుతున్న‌ట్టు వివ‌రిం చారు. అంతేకాదు.. రానున్న రెండుమూడేళ్ల‌లోనే రాజ‌ధాని పూర్త‌వుతుంద‌న్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి త‌ప్ప‌కుండా  రావాల‌ని.. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తికి ఆయ‌న ఆహ్వానం ప‌లికారు. రాష్ట్ర‌ప‌తి నుంచి తను ఎంతో నేర్చుకుంటున్నాన‌ని.. ఎంతో స్ఫూర్తి పొందుతున్నాన‌ని వివ‌రించారు. ఏపీలో ఎస్సీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. ఎస్టీలు నివ‌సించే ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు.