నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి మొగ్గు చూపుతున్నాయి. నాయకులు, కార్యకర్తల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు కూడా దీనికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే విభజన విషయంలో మాత్రం ఒక శాస్త్రీయ విధానాన్ని పాటించాలని సూచిస్తున్నాయి.

గతానికి భిన్నంగా

వాస్తవానికి దేశంలో నియోజకవర్గాల పెంపు అనేది కొత్త విషయం కాదు. ప్రతి 10 సంవత్సరాలకు జరిగే జనాభా లెక్కల ఆధారంగా ఏ రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు అవసరమో గుర్తించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఏ నియోజకవర్గంలో అవసరం ఎక్కువగా ఉందో పరిశీలిస్తారు. ఆ తరువాతే నియోజకవర్గాన్ని విభజించాలా వద్దా అన్నదానిపై కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ సూత్రాన్ని పక్కన పెట్టారు.

జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా నియోజకవర్గాలను పెంచాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా స్పష్టం చేశారు. తద్వారా ప్రతి రాష్ట్రంలోనూ సుమారు 50 శాతం మేరకు సీట్లు పెరగనున్నాయి. ఈ పరిణామం మంచిదేనని కొన్ని ప్రాంతీయ పార్టీలు చెబుతున్నాయి. కానీ మరికొన్ని పార్టీలు విభేదిస్తున్నాయి. పెరుగుతున్న సీట్లను పూర్తిగా మహిళలకు కేటాయించడాన్ని కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనే మహిళలకు కేటాయింపులు చేయాలని, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలను మహిళలకు కేటాయించడం ద్వారా బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయితే దీనిని బలంగా వ్యతిరేకిస్తే మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న భావన ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వివాదాలకు దారితీయే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.