జనసేన పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంది? అనేది తరచుగా తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారింది. ఇక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన వ్యవహార శైలి కూడా పార్టీలో ఇంకా చర్చకు వస్తూనే ఉంది.
మరోవైపు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆయన సతీమణి కొన్ని రోజుల కింద ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం వెంకట మాధవి వ్యవహారం కూడా తీవ్ర వివాదాస్పద రీతిలోనే కొనసాగుతోందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు జనసేన పార్టీని వివాదాల సుడిలోకి నెడుతున్నాయి.
ఎవరికి వారు చేస్తున్న రాజకీయాలు పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కీలకమైన భీమవరం నియోజకవర్గం లో జడ్పిటిసిగా ఉన్న నాయకుడు వివాదానికి కేంద్రంగా మారారు. ఓ యువతి సదరు నేతపై లైంగిక దాడి విమర్శలు చేయడం ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లడం వంటివి మరోసారి పార్టీ విషయంలో ఏం జరుగుతుందన్న చర్చకు దారి తీసేలా చేశాయి.
ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు అంతర్గత చర్చల్లో పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్టీ నాయకులు హద్దుల్లో ఉండాలని అదుపులో ఉండాలని చెబుతున్నారు. కానీ నాయకులు ఎక్కడా మారడం లేదు. అయితే ఇట్లాంటి విషయాల్లో సీరియస్ చర్యలు లేకపోతే క్షేత్రస్థాయిలో నాయకుల కారణంగా పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుంది. గతంలో అనేక అనుభవాలు కూడా ఉన్నాయి. పార్టీ ఏదైనాప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులను చూసి ప్రజలు ప్రభావితం అవుతారు.
వారి మూలంగా ఆయా పార్టీలు ఆయా పార్టీల అధినేతలకు ఇమేజ్ పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. దీనిని బట్టి జనసేన పార్టీ వ్యవహారం కూడా అలాగే ఉంది. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు స్పష్టమైన వైఖరితో పవన్ కళ్యాణ్ అడుగులు వేయాలి. ఒకరిద్దరిని సస్పెండ్ చేసినా లేకపోతే కఠినమైన చర్యలు తీసుకున్నంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం కాని ప్రభుత్వానికి వచ్చే నష్టం కాని ఉండదన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకోవాలి.
మౌనంగా ఉన్నంత మాత్రాన సమస్యలు సర్దుబాటు కావు.. అనేక విషయాల్లో ఇది రుజువైంది. నాయకులు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి కూడా ఉంది. పార్టీ- ప్రజలు కావాలనుకున్నప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నది అంతర్గతంగా నాయకుల నుంచి వస్తున్న సూచనలు. మరి ఏం చేస్తారనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates