మావి`గ‌న్‌`.. టైం వేస్ట్ పాలిటిక్స్‌.. !

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన `మావిగన్` అంటే…. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన రాజధానిపై ప్రజల్లో ఏ మేరకు చర్చ ఉంది; ఎంతవరకు దానిని ఆహ్వానిస్తున్నారు అనే విషయం గమనిస్తే జీరో అనే చెప్పాలి. ఈ వ్యవహారం పై ప్రజలు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. అసలు జగన్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకో లేదు. గతంలో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా ప్రజలు పట్టించుకోలేదన్న విషయం గత ఎన్నికల్లో రుజువైంది.

నిజానికి అప్పట్లో విశాఖపట్నం, కర్నూలు, గుంటూరును మూడు రాజధానులుగా ప్రకటిస్తానని జగన్ చెప్పినప్పుడు ప్రజల మధ్య ఆ మేరకు చర్చ నడిచి ఉండాలి. ఆ చర్చ తాలూకా ప్రభావం 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు రాల్చేలా కూడా ఉండాలి. కానీ, అదేది జరగలేదు అంటే మూడు రాజధానులు విషయాన్ని ప్రజలు పట్టించుకోలేదని స్పష్టమైనది. అదే విధంగా ఇప్పుడు మావిగన్ విషయంలో కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సీరియస్ గా కూడా తీసుకోలేదు.

జగన్ వ్యవహార శైలి ఇంతే, జగన్ మైండ్ సెట్ ఇంతే అనే కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అధికార పార్టీ టిడిపి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తోంది. పెద్ద ఎత్తున రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల్లో లేని విషయాన్ని అనవసర రాజకీయాల కోసం ఉపయోగించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మరొకటి ఉండదన్నది పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలు అమరావతికి అనుకూలంగా ఉన్నారు.

ఇటీవల పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయినప్పుడు కూడా ప్రజలు ఆనందించారు. రాజధాని ప్రాంతంతో సహా విశాఖపట్నం, కర్నూలు వంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆహ్వానిస్తూ ట‌పాసులు కాల్చిన పరిస్థితి ఉంది. సో దీనిని బట్టి ప్రజలు కోరుకుంటున్నది మావిగన్ కానీ మూడు రాజధానులు కానీ కాదన్నది స్పష్టమవుతున్నప్పుడు దీనిని అనవసరంగా రాజకీయం చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదని పరిశీలకులు చెబుతున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో లేని చర్చను నాయకులు చేయటం వల్ల కేవలం రాజకీయాలు మాత్రమే మిగులుతాయి తప్ప ప్రయోజనం ఏమి ఉండదని సూచిస్తున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు ఈ విషయాన్ని వదిలేస్తే అమరావతి విషయమే ప్రజల్లో చర్చకు ఉంటుంది. దానికే ప్రజల వైపు నుంచి మద్దతు కూడా లభిస్తుంది.