పని చేస్తే పదవులే… డిజిటల్ సేనకు లోకేష్ హామీ

టీడీపీకి కార్య‌క‌ర్త‌లే వెన్నెముక‌ని.. త‌ర‌చుగా పార్టీఅధినేత సీఎం చంద్ర‌బాబు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ ఇటు కార్య‌క‌ర్త‌ల‌తోపాటు.. మ‌రోవైపు.. `డిజిట‌ల్ ప్లాట్ ఫాం`ను కూడా ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట `మై-టీడీపీ` పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఈ యాప్ ద్వారా.. స‌మ‌స్య‌లు సేక‌రించ‌డంతోపాటు క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంతేకాదు. నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించేందుకు కూడా దీనిని వేదిక‌గా చేసుకున్నారు.

మై-టీడీపీ యాప్‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాలని.. ద్వారా పార్టీ కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని నారా లోకేష్ సూచించారు. దీనికి సంబంధించి కార్య‌క‌ర్త‌ల‌కు కొన్ని ల‌క్ష్యాలను కూడా నిర్దేశించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ యాప్ ప‌నితీరును కూడా లోకేష్ తెలుసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో మై-టీడీపీ యాప్‌` నిర్వ‌హ‌ణ‌, ప్ర‌చారంలో ముందున్న 10 మంది ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను గుర్తించి.. వారిని ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసానికి మంత్రి ఆహ్వానించారు. వారితో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా మై-టీడీపీ యాప్ ఏవిధంగా ప‌నిచేస్తోంది.. ఎలాంటి మెరుగులు దిద్దుతున్నారు? ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా యాప్ దోహ‌ద‌ప‌డేలా ఉంది? పార్టీపై ఫీడ్ బ్యాక్‌.. ఇలా అనేక విష‌యాల‌ను వారి నుంచి తెలుసుకున్నారు. వారి ప‌నితీరును మెచ్చుకున్నారు. అయితే.. అస‌లు యుద్ధం ముందుంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ మ‌రో 10 మంది ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను త‌యారు చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌చారం చేయాల‌న్నారు. సంక్షేమ కార్య‌క్ర‌మా లపై ప్ర‌జ‌ల నాడిని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని పేర్కొన్నారు.

పార్టీ కోసం ప‌నిచేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తింపు ఉంటుంద‌న్నారు. ఇలాంటి వారిని తానే స్వ‌యంగా ఎంపిక చేసిప‌ద‌వులు ఇచ్చేలా చేస్తాన‌న్నారు. అదేవిధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారిని ఖ‌చ్చితంగా స‌భ‌ల‌కు పంపించేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈవిష‌యాన్ని కార్య‌క‌ర్త‌లు గుర్తు పెట్టుకోవాల‌న్నారు. ప‌నిచేసేవారికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని.. సిఫార‌సులతో ప‌నులు జ‌ర‌గ‌బోవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అనంత‌రం.. 10 మందినీ పేరుపేరునా అభినందించి.. స‌త్క‌రించారు.