ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని నియ‌మించిన విష‌యం తెలిసిందే. గ‌త ఆరుమాసాల కింద‌టే ఈ క‌మిటీ నియామ‌క‌మైంది. ఈ క‌మిటీ స‌భ్యులు ఇప్ప‌టి వ‌ర‌కు 4 సార్లు ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై చ‌ర్చించారు. తాజాగా మంగ‌ళ‌వారం మ‌రోసారి భేటీ అయి.. తుది నివేదిక‌ను రూపొందించారు.

2 ప్ర‌తిపాద‌న‌లు..

విశాఖ‌లో నిర్మించిన భారీ ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న అంశంపై మంత్రుల క‌మిటీ రెండు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేసింది. 1) వైసీపీ నిర్మించిన విలాస‌వంత‌మైన ప్యాలెస్‌ను ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నకు ఎగ్జిబిష‌న్‌గా వినియోగించ‌డం. 2) ప్ర‌ముఖ హోట‌ళ్ల యాజ‌మాన్యాలు కోరుతున్న‌ట్టుగా వాటికి లీజుకు ఇవ్వ‌డం. ఈ రెండు ప్ర‌తిపాద‌న‌ల్లో న‌లుగురు మంత్రులు కూడా 1వ ప్ర‌తిపాద‌న‌కే మొగ్గు చూపుతున్నారు. ముగ్గురు మంత్రులు దీనిని ప్ర‌తిపాదించారు. ఒక్క‌రు మాత్ర‌మే ఇత‌ర సంస్థ‌ల‌కు నిర్వ‌హ‌ణ‌కు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. దీనిని సీఎం చంద్ర‌బాబు ముందు ఉంచి.. నిర్ణ‌యం తీసుకుంటారు.

ఆ ప్ర‌తిపాద‌న ఎందుకు?: వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ప్ర‌జాధ‌న దుర్వినియోగాన్ని ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేసేందుకు దీనిని వినియోగించుకోవాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం గ‌తంలో నిర్ణ‌యించింది. అయితే.. కొన్ని అభ్యంత‌రాల‌తోపాటు.. ప్ర‌ధానంగా కూట‌మి మిత్ర ప‌క్షం బీజేపీ ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించింది. దీనిని ఏదైనా లీజుకు ఇస్తే ఆదాయం వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించింది. అయితే.. ఈప్ర‌తిపాద‌న విష‌యంలో కూడా క‌మ‌ల నాథులు విడిపోయారు. కొంద‌రు అలాకాదు.. ఎగ్జిబిష‌న్ చేయాల‌ని కోరారు. దీంతో ప్ర‌భుత్వం క‌మిటీని నియ‌మించింది.

ఏం చేస్తారు?

మంత్రి వ‌ర్గ క‌మిటీ మెజారిటీ నిర్ణ‌యంమేర‌కు రుషి కొండ‌ను. .. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వినియోగించ‌నున్నార‌ని తెలుస్తోంది. త‌ద్వారా వైసీపీ ఎలాంటి ప‌నులు చేసిందో.. ఎంత వృథా చేసిందో వివ‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ద్వారా జ‌గ‌న్ మైండ్ సెట్‌.. ఆయ‌న నిధుల వినియోగం.. చేసిన అప్పులు వంటివి చ‌ర్చ‌కు వ‌స్తాయ‌ని త‌ల‌పోస్తున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు కూడా సానుకూలంగా ఉన్నార‌ని గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విలాస‌వంత‌మైన ఈ భ‌వ‌నాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు పెడ‌తారని స్ప‌ష్ట‌మ‌వుతోంది.