మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది.. మహిళలకు నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. దీంతో బలమైన సామాజిక వర్గాలు, బలమైన మహిళల‌ నాయకత్వానికి టిడిపి పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా రాయపాటి శైలజను పార్టీ అధినేత రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ప్ర‌స్తుతం మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ అమరావతి ఉద్యమంలో బలంగా పోరాడారు. రైతుల పక్షాన బలమైన గ‌ళం వినిపించారు. దీంతో పాటు పార్టీ పరంగా కూడా ఆమె నేరుగా కండువా కప్పుకోకపోయినప్పటికీ సమర్థిస్తూ వస్తున్నారు. చంద్రబాబు అంటే అభిమానం. నారా లోకేష్ పాలసీలకు అనుకూలంగా ఆమె వ్యవహరించిన నేపథ్యంలో బలమైన నామినేటెడ్ పదవిగా ఉన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా చంద్రబాబు ఆమెను నియమించారు. ఇక వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ పదవి కాలం పూర్తవుతుంది.

దీంతో ఆమెను నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే గుంటూరు జిల్లాలో ఏర్పడే మహిళా నియోజకవర్గంలో ఖచ్చితంగా రాయపాటి శైలజ కి టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గం, అదేవిధంగా బలమైన గ‌ళం, దీనితో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేపథ్యంలో రాయపాటి శైలజ అన్ని విధాలా రాజకీయాల్లో నిలదుక్కుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా మహిళల సానుభూతి వారి ఓటు బ్యాంకు కూడా రాయపాటి శైలజకు కలిసి వస్తున్న అంశాలుగా చెబుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఆమెకు రాజకీయంగా మరింత అనుకూల వాతావర‌ణం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో దాదాపు 88 నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నాయి. వీటిలో అధికంగా నియోజకవర్గాలు మహిళలకే కేటాయిస్తారు అన్న అంచనా ఉంది. ఈ క్రమంలోనే బలమైన నాయకుల కోసం పార్టీ అన్వేషిస్తోంది.

ఈ పరంపరలో రాయపాటి శైలజ పార్టీకి కలిసి వచ్చే అంశమని నాయకులు చెబుతున్నారు. సో మొత్తంగా వచ్చే ఎన్నికలనాటికి రాయిపాటి శైలజ కచ్చితంగా ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తారనే అంచనాలు బలపడుతున్నాయి. ఈ విషయంపై చంద్రబాబు కూడా పరిశీలన చేస్తున్నారని పార్టీ వర్గాల నుంచి సమాచారం. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే రాయపాటి శైలజ టికెట్ కోరుకున్నారని ప్రచారం జరిగింది. అప్పట్లో నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ ప్ర‌తిపాద‌న‌ను పక్కన పెట్టారు. అందుకే కీలకమైన పదవిని ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇక వచ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగూ నియోజకవర్గాలు పెరుగుతున్న క్రమంలో శైలజకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు ఖాయమని అంటున్నారు.