తాడిపత్రిలో నిప్పు రాజుకుందా ?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండుపార్టీల మధ్య నిప్పు రాజుకున్నట్లే ఉంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులాగున్న వ్యవహారం ఒక్కసారిగా ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి చర్య వల్ల ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ తరపున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచారు. దాంతో జేసీ బ్రదర్స్ దశాబ్దాల ఆధిపత్యానికి ఒక్కసారిగా బ్రేకులు పడినట్లయ్యింది. దానికితోడు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో బ్రదర్స్ కు ఇబ్బందులు కూడా మొదలయ్యాయి.

తమ హవాకు బ్రేకులు పడటాన్ని బ్రదర్స్ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే చీటికి మాటికి ఏదో రూపంలో పెద్దారెడ్డిని రెచ్చగొడుతునే ఉన్నారు. పెద్దారెడ్డి కూడా వీళ్ళతో సై అంటే సై అంటుండంతో ఇద్దరి మధ్దతుదారుల మధ్య చెదురుమదురు గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే పెద్దారెడ్డి భార్యపై సోషల్ మీడియా చాలా అసభ్యంగా పోస్టులు మొదలయ్యాయి. ఈ పోస్టులను చూసి ఎంఎల్ఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుండి ఎటువంటి యాక్షన్ కనబడలేదు.

దాంతో ఒకటికి రెండుసార్లు పెద్దారెడ్డి బహిరంగంగానే జేసీ బ్రదర్స్ కు వార్నింగులిచ్చారు. అయినా పోస్టుంగులు ఆగకపోవటంతో చివరకు గురువారం మధ్యాహ్నం పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికే వెళ్ళిపోయారు. అక్కడ ఎంఎల్ఏ మద్దతుదారుల్లో ఎవరో జేసీ మద్దతుదారుల్లో ఒకళ్ళని కొట్టారట. ఇంకేముంది నిప్పురాజుకుంది. అయితే ఆ సమయంలో జేసీ ఇంట్లో లేకపోవటంతో కాసేపు అక్కడే కూర్చున్న పెద్దారెడ్డి వెళ్ళిపోయారు.

ఎంఎల్ఏ+మద్దతుదారులు తమ ఇంటిపైకి దాడికి వచ్చిన విషయం తెలియగానే వెంటనే మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటకి చేరుకున్నారు. తమ ఇంట్లో పెద్దారెడ్డి కూర్చున్న కుర్చునీ తగలపెట్టేశారు. ఇదే సమయంలో జేసీ బ్రదర్స్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి వీరంగం మొదలుపెట్టారు. ఇటువంటిదేదో జరుగుతుందని ఊహించిన పోలీసులు ముందుజాగ్రత్తగా జేసీ ఇంటి దగ్గరే కాకుండా ఆ ఏరియా మొత్తం మీద పెద్ద ఎత్తున మోహరించారు.

అయితే జేసీల మద్దతుదారులు పోలీసులను కూడా లెక్క చేయకుండా రోడ్లో పోయేవాళ్ళతో గొడవలకు దిగారు. వీరిని అడ్డుకునే క్రమంలో చివరకు పోలీసులతో కూడా గొడవలయ్యాయి. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు మొదలైపోయాయి. పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. మొత్తానికి ఆ ప్రాంతంలో ఎప్పుడేమవుతుందో అర్ధంకాక మామూలు జనాలు వణికిపోతున్నారు.