క్షమాపణలు కోరిన జగన్

సొంతజిల్లా కడపలో మూడు రోజుల పర్యటనలో ఉన్న జగన్ ఓ విషయంలో ప్రజలను క్షమాపణలు కోరారు. గండికోట రిజర్వాయర్ విషయమై మాట్లాడుతూ ప్రజల త్యాగాల వల్లే గండికోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ‘పునరావాసం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమించండి’ అని వేదిక మీదనుండి చేతులు జోడించి వేడుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదలైన గండికోట రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. తర్వాత కూడా పనులు జరిగినా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాలెన్సు పనులను స్పీడుగా పూర్తిచేశారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యం 26.85 టీఎంసీలు. అయితే గండికోట రిజర్వాయర్లో ఎప్పుడు కూడా పూర్తిస్ధాయిలో నీటి నిల్వ జరగలేదు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యం పెంచేకొద్దీ ముంపు మండలాల సమస్య కూడా పెరిగింది.

పూర్తి స్ధాయిలో నీటి నిల్వ చేయాలన్న జగన్ ఆదేశాలతో రిజర్వాయర్ కు ఆనుకుని ఉన్న కొండాపురం మండలంలోని కొన్ని గ్రామలతో పాటు తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామాన్ని కూడా నీళ్ళు చుట్టేశాయి. అయితే తమకు పునరావాసం కల్పించకుండా తమ గ్రామాలను వదిలిపెట్టమంటే ఎక్కడికీ వెళ్ళేది లేదని పై గ్రామాల్లోని జనాలు గట్టిగా ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. దాంతో ఉన్నతాధికారులకు, గ్రామస్తులకు మధ్య చాలా కాలం వివాదాలు నడిచాయి.

మొత్తానికి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చొరవతో పునరావాసంతో పాటు నష్టపరిహారం వివాదం కూడా ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఇంకా కొంతమందికి నష్టపరిహారం అందలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో జగన్ వేదిక మీద నుండి తనను క్షమించమని వేడుకున్నారు. 2013లో మొదటిసారిగా రిజర్వాయర్లో 3 టీఎంసీల నీటిని నిల్వచేశారు. 2016లో 5.5 టీఎంసీలు, 2017లో 8.2 టీఎంసిలు, 2018లో 12 టీఎంసీలు, 2019లో కూడా 12 టీఎంసీల నీటిని నిల్వచేశారు. ఈ యేడాదిలోనే రికార్డు స్ధాయిలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.