కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 25న ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాకు ఉన్న పాత్రను, తెలంగాణ జాగృతి చేసిన పోరాటాన్ని గుర్తు చేసిన కవిత… రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యమని తాను ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. తెఅంగాణ ఆడబిడ్డలకు న్యాయం జరగాలన్నా, అణగారిన వర్గాలకు అందలం దక్కాలన్నా కొత్త రాజకీయ పార్టీ అవసరమని తాము భావిస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఏవేవే చేస్తామని చెబుతున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు అవసరం తీరాక వాటిని మరిచిపోతూ బడుగు వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని చెప్పిన కవిత… అదే ముహూర్తానికి తన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. ఈ ప్రకటనకు మేడ్చల్ జిల్లా పరిధిలోని మునీరాబాద్ వేదిక కానుందని ఆమె ప్రకటించారు. మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో జాగృతి కార్యకర్తల సమక్షంలో పార్టీ పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని కవిత చెప్పారు. పార్టీ పేరు ప్రకటన కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.