మోడీతో ద‌గ్గుబాటి… అవన్నీ పుకార్లేనా?

ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీతో సీనియ‌ర్ నాయ‌కురాలు, బీజేపీ ఏపీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, వెంక‌టేశ్వ‌ర‌రావు దంప‌తులు భేటీ అయ్యారు. అయితే.. స‌హ‌జంగానే ఈ భేటీ జ‌రిగి ఉండొచ్చు.. అనే ప్ర‌శ్న వ‌స్తుంది. కానీ, దీని వెనుక కొన్ని వివాదాల‌కు చెక్ పెట్టాల‌న్న ఉద్దేశం కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

బుధ‌వారం సాయంత్రం ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన ద‌గ్గుబాటి దంప‌తులు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలపై సంక్షిప్తంగా చర్చించడంతో పాటు, దేశంపై దాని ప్రభావం తక్కువగా ఉండేలా తీసుకున్న చర్యలు, గ్లోబల్ స్థాయిలో భారత్ పోషిస్తున్న నాయకత్వ పాత్ర గురించి వివరించారు.

అదేస‌మ‌యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. మాజీ ప్ర‌ధాని వాజపేయితో తనకు ఉన్న‌ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారతదేశం తరఫున మాట్లాడే అవకాశం ఆయన కల్పించిన విషయాన్ని వివరించారు. అలాగే, ఇటీవ‌ల ద‌గ్గుబాటి రచించిన `ది గ్లింప్స్ ఆఫ్ వ‌రల్డ్ హిస్ట‌రీ` పుస్త‌కాన్ని ప్ర‌ధానికి బ‌హూక‌రించారు. అదేవిధంగా, త‌మ‌కు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించే అవకాశం క‌ల్పించార‌ని ప్ర‌ధానిని కొనియాడారు. ఎంతో అరుదైన, గౌరవప్రదమైన విషయం అని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రోవైపు.. ప్రపంచ చరిత్రపై ఇంత విపులమైన గ్రంథాన్ని రచించడానికి చేసిన కృషిని పేర్కొంటూ.. వెంక‌టేశ్వ‌ర‌రావును ప్రధానమంత్రి అభినందించారు. ఇదిలావుంటే, ప్ర‌స్తుతం పార్ల‌మెంటు జ‌రుగుతున్నా.. మ‌రోవైపు బుధ‌వారం క్యాబినెట్ స‌మావేశం.. మ‌రోవైపు అఖిల ప‌క్ష స‌మావేశం ఇలా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని త‌మ‌కు స‌మ‌యం కేటాయించ‌డాన్ని ద‌గ్గు బాటి దంప‌తులు ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రి అభివృద్ధి, ఎంపీగా తాను చేస్తున్న ప‌నుల‌నుకూడా పురందేశ్వ‌రి వివ‌రించారు. బీజేపీ ఏపీలో ఎలావిస్త‌రిస్తోంది.. ఏవిధంగా ముందుకు వెళ్తోంద‌న్న విష‌యాన్ని కూడా పేర్కొన్నారు.

స‌మ‌స్య‌కు చెక్‌!

మ‌రోవైపు.. ప్ర‌ధాని మోడీని క‌లుసుకోవ‌డం ద్వారా ఏపీలో కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి ద‌గ్గుబాటి దంప‌తులు చెక్ పెట్టార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ప్ర‌స్తుతం పురందేశ్వ‌రి బీజేపీలో ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె త‌న కుమారుడు చెంచురామ్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకువ‌స్తున్నారు.

గ‌తంలో వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీపీలో ఉన్న నేప‌థ్యానికి తోడు చెంచురామ్‌కు కూడా వైసీపీలో ఉన్న ప‌రిచ‌యాలు.. వ్యాపార సంబంధాల నేప‌థ్యంలోఆయ‌న వైసీపీ వైపు చూస్తున్నార‌ని కొన్నాళ్లుగా బీజేపీలోనే అంత‌ర్గత ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ప్ర‌ధాని మోడీని దంప‌తులు క‌లుసుకోవ‌డం ద్వారా ఈ త‌ర‌హా ప్ర‌చారానికి ప‌రోక్షంగా చెక్ పెట్టిన‌ట్టు అయింద‌ని అంటున్నారు.