సీఎం పోస్టు ఖాళీ లేదు… తేల్చేసిన రేవంత్‌!?

తెలంగాణ‌లో రాక రాక అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌మంత్రి సీటుకోసం చాలా మంది ట్రై చేశారు. అయితే.. అధిష్టానం ఈ సీటును రేవంత్‌రెడ్డికి అప్ప‌గించేందుకు అనేక ప్ర‌యాస‌లు ప‌డింది. అనేక మంది సీనియ‌ర్ల‌ను బుజ్జ‌గించి.. ఒప్పించింది. దీంతో ప్ర‌స్తుత ట‌ర్మ్‌లో ఆయ‌నే ముఖ్య‌మంత్రి. మ‌రో రెండున్న‌రేళ్ల‌పాటు రేవంత్ రెడ్డే సీఎంగా కొన‌సాగుతారు. అయితే.. మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. త‌మ వంతు వ‌స్తుంద‌ని కొంద‌రు నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్న విష‌యం వాస్త‌వం. రెండోసారి కూడా అధికారం ద‌క్కించుకుంటే.. సీఎం అయ్యేందుకు సీనియ‌ర్ల‌లో ముగ్గురు నుంచి న‌లుగురు నాయ‌కులు సిద్ధంగా ఉన్నారు.

వీరిలో రెడ్డినేత‌లు స‌హా.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు అదేవిధంగా బీసీసామాజిక వ‌ర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ, ఇంకా చాలా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రూ బ‌య‌ట ప‌డ‌డం లేదు. ఇదిలావుంటే.. తాజాగా ఈ విష‌యాన్ని కూడా ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చినా.. తానే ముఖ్య‌మంత్రిని అన్న అర్థం వ‌చ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. సిద్దిపేట‌లో నిర్వ‌హించిన రైతు భ‌రోసా(పెట్టుబ‌డి సాయం నిధుల విడుద‌ల‌) స‌భ‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు.

“బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే.. కాంగ్రెస్‌కు కూడా రెండోసారి తెలంగాణ ప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తారు“ అని చెప్ప‌డం ద్వారా రాష్ట్రంలో రెండోసారి కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని సీఎం వ్య‌క్తం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న “సిద్దిపేట నుంచి ఎవ‌రు గెలిచినా.. నా మంత్రి వ‌ర్గంలో చోటు ఖాయం. మంత్రిప‌ద‌వి ఖాయం“ అని తేల్చి చెప్పారు. వాస్త‌వానికి సిద్దిపేట నుంచి ఎవ‌రైనా గెలవాలంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాలి. ఆ త‌ర్వాత‌.. రాష్ట్రంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వంలో వారికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంది. అయితే.. ఆ ప్ర‌భుత్వం కూడా త‌న‌దేన‌ని ప‌రోక్షంగా రేవంత్‌రెడ్డి తేల్చేశారు.

బీసీల మాటేంటి?

ఈ సంద‌ర్భంగా గ‌తంలో(ఆరు మాసాల్లో) రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీ గ‌ణ‌న చేసిన ఆయ‌న‌.. 43 శాతం మంది బీసీలు ఉన్నార‌ని.. వారికి ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం క‌ల్పించాల‌ని.. అది కాంగ్రెస్‌పార్టీ తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు.

అంతేకాదు.. “రెడ్డి సీఎంల‌లో నేనే చివ‌ర కావొచ్చు“ అని కూడా గ‌త ఏడాది ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లోనే వ్యాఖ్యానించారు. అంటే బీసీల‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న సంకేతాలు ఇచ్చారు. కానీ, తాజాగా సిద్దిపేట స‌భ‌లో మాత్రం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నా కూడా తానే ముఖ్య‌మంత్రిన‌న్న విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. మ‌రి ఇది ఆయ‌న ఉద్దేశ‌పూర్వ‌కంగానే సంకేతాలు ఇచ్చారా? లేక‌.. ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన సంకేతం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారా? అనేది చూడాలి.