హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం.. ఆన‌క‌… పార్టీ నాయ‌కుల‌కు దారి త‌ప్పుతున్న వారిని స‌రిదిద్దే బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వ‌ర‌కు టీడీపీ అధినేత‌,. సీఎం చంద్ర‌బాబు ప‌రిమితం అవుతున్నారు. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వారిపై కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ఠినంగా ఒక్క చ‌ర్చ కూడా తీసుకోలేదు. పైగా.. వారిని హెచ్చ‌రిస్తున్నాం.. అని చెబుతూ.. స‌రిపెట్టుకుంటున్నారు.

ఇది అంతిమంగా పార్టీపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తోంద‌న్న‌ది.. ఏలూరు ఎంపీ పుట్టామ‌హేష్‌కుమార్ యాద‌వ్ వ్య‌వ‌హారం స్ప‌ష్టం చేస్తోంది. 2024 జూన్‌లోనూ ఈయ‌న‌పై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో కూడా.. ఇలానే సీరియ‌స్ అయ్యారు. ఇక‌పై చూస్తూ ఊరుకునేది లేద‌ని వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు మ‌రోసారి ఏకంగా పాజిటివ్ వ‌చ్చింది. ఇది చంద్ర‌బాబు చేస్తున్న విజ‌న్‌ పాల‌న‌ను పూర్తిగా తుడిచి పెడుతోంద‌న్న వాద‌న‌ను బ‌ల‌ప‌రిచేలా చేస్తోంది.

ఎంత విజ‌న్ ఉన్నా.. ఎంత నిబ‌ద్ధ‌త‌తో పాల‌న‌చేసినా.. సైన్యాన్ని ముందుండి న‌డిపించే చంద్ర‌బాబు వంటివారికి ఇలాంటి ఘ‌ట‌న‌లు పెద్ద మ‌చ్చ‌లుగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల తీరు చూస్తే.. ఎంపీల‌తో ప‌డ‌డం లేదు. ఒకరిపై ఒక‌రు గిల్లిక‌జ్జాలు పెట్టుకుంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటు న్నారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ధ్య‌క‌లివిడి అనేది నేతి బీర‌ను త‌ల‌పిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఒక్క‌రిపైనైనా సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుని.. పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డ‌మో.. లేక‌. క్ర‌మ శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మో చేస్తే.. ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాదు.

కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు వారిపై సీరియ‌స్ అవుతున్నామ‌ని చెబుతూ.. వారే మారుతార‌న్న ధోర‌ణిలో చంద్ర‌బా బు ప్ర‌ద‌ర్శిస్తున్న ఉదాశీన‌త‌.. చివ‌ర‌కు ఆయ‌న‌కే ఇబ్బందిక‌రంగా మారుతోంది. వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌లేని ప‌రిస్థితిని తీసుకువ‌స్తోంది. ఇది స‌రైన విదానం కాద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నాయ‌కుల‌పై ఒక్క‌రిపైనైనా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని కూడా చెబుతున్నారు. ఘ‌ట‌న‌లు జ‌రిగిన త‌ర్వాత‌.. పార్టీ ప‌రంగా సీరియ‌స్ అవుతున్న‌ట్టు చెబుతున్నారే.. త‌ప్ప‌, ఎక్క‌డా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం.. పార్టీని ప‌లుచ‌న చేసే ప‌రిస్తితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు.