బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

‘మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ’ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ సీఎం కేసీఆర్ స‌హా కేటీఆర్‌కు తీవ్ర సంక‌టంగా మారింద‌నే చ‌ర్చ సాగు తోంది. డ్ర‌గ్స్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డమే కాదు.. మ‌రో రెండు కార‌ణాలు కూడా రోహిత్ చుట్టూ తిరుగుతున్నాయి. వీటి నిగ్గు తేల్చేందుకు.. ప్ర‌త్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటైంది. ఈ నేప‌థ్యంలో రోహిత్‌పై పార్టీ ప‌రంగా ‘ఇంత‌కుమించి’ చ‌ర్య‌లు తీసుకుంటే ఇబ్బంది వ‌స్తుంద‌ని బీఆర్ఎస్ భావిస్తోంద‌ని స‌మాచారం.

స‌హ‌జంగా డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే.. నాయ‌కుల‌ను పార్టీకి దూరంగా పెట్ట‌డం, వారి నుంచి సంజాయిషీ కోర‌డం వంటివి చిన్న విష‌యాలు. ఈ ప‌నిని టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్‌కుమార్ యాద‌వ్ విష‌యంలో ఆ పార్టీ చేసింది. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంది. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం.. రోహిత్ విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని.. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ముక్త‌స‌రిగా నోటీసులు ఇచ్చింది.

దీనికి ప్ర‌ధానంగా.. రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 1) గ‌త ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని సుమారు న‌లుగురు ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు ఆయ‌నే నిధులు స‌మ‌కూర్చార‌ని అంటున్నారు. వారు ఓడి పోయినా.. నిధులు మాత్రం తిరిగి ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. దీనికి తోడు రెడ్డి సామాజిక వ‌ర్గం ఇప్ప‌టికే బీఆర్ఎస్‌పై ఆగ్ర‌హంగా ఉంది. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని ఆ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోహిత్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకుంటే నెగిటివ్ టాక్ మ‌రింత పెరుగుతుంద‌ని పార్టీ త‌ల‌పోస్తోంది.

2) త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయాల‌ని భావించిన బీజేపీ వ్యూహాల‌ను.. ప‌సిగ‌ట్టి.. రోహిత్ రెడ్డి ఉప్పందించారు. త‌ద్వారా.. మొయినాబాద్ కేంద్రంగానే గ‌తంలో కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసులో పూర్తి ఆధారాలు.. కేసు పెట్టింది కూడా.. రోహిత్‌రెడ్డే. ఇప్పుడు ఆయ‌న‌ను దూరం చేసుకుంటే.. ఈ కేసు వీగిపోవ‌డంతోపాటు.. బీజేపీకి ఆయుధంగా మారుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పైగా.. ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ కేసులో బీజేపీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. రోహిత్ ఏమాత్రం అటువైపు మ‌ళ్లి అది బీఆర్ఎస్‌కు మ‌రింత మైన‌స్ అవుతుంది. ఈ కార‌ణాల‌తోనే రోహిత్‌రెడ్డిపై ఇంత‌కు మించి చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి లేద‌ని బీఆర్ఎస్ భావిస్తున్న‌ట్టు చ‌ర్చ సాగుతోంది.