ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే.. ఔన‌నే అంటున్నారు అమెరికా జాతీయ భ‌ద్ర‌తాధికారులు. అంతేకాదు.. అమెరికా ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి కూడా ఇదే వ్యాఖ్య చేయ‌డం గ‌మ‌నార్హం. ఏడాది కాలం అమెరికాకు సంబంధించి బ‌డ్జెట్ మొత్తం ఇప్పుడు ఇరాన్ యుద్ధం కోసం కేటాయించ‌డంపై అమెరికాలో తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌ధ్యంత‌ర ఎన్నికలు ఉన్న‌నేప‌థ్యంలో ట్రంప్‌ రాంగ్ స్టెప్ వేశారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఏం జ‌రిగింది?

ఇరాన్‌పై యుద్ధం చేయ‌డం అనేది..అమెరికాకు న‌వంబ‌రు నుంచే ఉన్న ప్ర‌ణాళిక‌. ఇరాన్ అణ్వాయుధాలను పోగేసుకుంటోద‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. కానీ.. వాస్త‌వానికి ఇరాన్ నుంచి వ‌చ్చే చ‌మురుపై గుత్తాధిపత్యం పొందాల‌న్న‌ది ట్రంప్ ప్ర‌ధాన ఆలోచ‌న‌. దీనికి ఇరాన్ స‌సేమిరా అన‌డం.. అణ్వాయుధాల‌పై కావాలంటే త‌నిఖీలు చేసుకోమ‌నడం కూడా.. అప్ప‌ట్లోనే చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. ట్రంప్ నిరాక‌రించారు. ఈలోగా ఇరాన్‌లో హిజాబ్‌ను స‌రిగా ధ‌రించ‌ని ఓ మ‌హిళ‌పై పోలీసులు కేసు పెట్టి క‌స్ట‌డీలో హింసించ‌డంతో ఆమె మృతి చెందారు.

దీంతో దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు, మ‌హిళ‌లు రోడ్డెక్కినిర‌స‌న చేశారు. ఈ నిర‌స‌న‌ల‌ను ఇరాన్ అప్ప‌టి సుప్రీంపాల‌కుడు ఖ‌మేనీ ఉక్కుపాదంతో అణిచేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాదాపు 7 వేల మంది పౌరులు ఇరాన్ వ్యాప్తంగా జ‌రిగిన నిర‌స‌న‌ల్లో మృతి చెందారు. దీనిని అమెరికా త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. ఇరాన్ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డంతోపాటు.. మేం అండ‌గా ఉంటామ‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు. దీంతో నిర‌స‌న‌లు మ‌రింత పెరిగాయి. ఇదే ద‌న్నుగా ఇజ్రాయెల్ కూడా.. త‌మ సార్వ‌భౌమాధికారాన్ని ఇరాన్‌కు ప‌ణంగా పెట్టేది లేద‌ని గ‌ర్జించింది.

ఇలా.. అటు అమెరికా.. ఇటు ఇజ్రాయెల్ యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. అయితే.. ఈ స‌న్న‌ద్ధ‌త స‌మ‌యంలోనే అమెరికా కాంగ్రెస్ నేత‌లు.. చ‌మురు సంక్షోభం వ‌స్తుంద‌ని.. ఇరాన్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని స‌ల‌హా ఇచ్చారు. ఇది ప్ర‌పంచంపైనా ప్ర‌భావం చూపుతుంద‌ని హెచ్చ‌రించారు. అయినా ట్రంప్‌.. కేవ‌లం ఒక‌వైపే చూశారు. ఇరాన్ పాల‌న‌ను మార్చాల‌ని.. త‌మ అనుకూల వ్య‌క్తిని అక్క‌డ ప్ర‌తిష్టించాల‌ని ఆయ‌న భావించారు. ఈ క్ర‌మంలోనే యుద్ధం వ‌చ్చింది. ఖ‌మేనీని చంపేశారు.

దీంతో రెచ్చిపోయిన ఇరాన్ .. త‌న అధీనంలో ఉన్న హోర్ముజ్ జ‌ల‌సంధిని వ‌శం చేసుకుని నౌకార‌వాణాను నిలువ‌రించింది. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు మంట‌లు రేగేలా చేసింది. మ‌రోవైపు.. గ‌ల్ప్ దేశాల్లోని అమెరికా స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేసింది. రాయ‌బార కార్యాల‌యాల‌పైనా దాడులు కొన‌సాగిస్తోంది. దీంతో ఇప్పుడు ప్ర‌పంచం ముందు ట్రంప్ దోషిగా నిల‌బ‌డాల్సి వ‌చ్చింది. యుద్ధాన్ని విరమించాలని.. ప్ర‌పంచ దేశాలు ట్రంప్‌పై వ‌త్తిడి తీసుకువ‌స్తున్నారంటే.. ట్రంప్ దూకుడును ప్ర‌పంచం యావ‌త్తు .. తిప్పికొడుతున్న‌ట్టేన‌ని అమెరిక‌న్‌ కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు.