ప్రముఖ ఎన్నారై నాయకుడు, టీడీపీ ఎన్నారై విభాగాల సమన్వయ కర్తగా ఉన్న కోమటి జయరాంకు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీకే పరిమితం అయిన జయరాంకు.. తొలిసారి.. చంద్రబాబు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విదేశీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఉత్తర అమెరికా వ్యవహారాలకు సంబంధించి ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు.
ఈ మేరకు గురువారం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ వెంటనే కోటమి జయరాం కూడా బాధ్యతలు తీసుకున్నారు. అమరావతిలోని ఏపీ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం(ఏపీఎన్ఆర్టీఎస్) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోమటి జయరాం.. ఉత్తర అమెరికాలో ఏపీ సర్కారు ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయనను అభినందించారు.
ఏం చేస్తారు?
ఉత్తర అమెరికాలో ఏపీకి చెందిన వేలాది మంది చదువు, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్నారు. వారిని కోటమి జయరాం సమన్వయం చేయనున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని తెలుసుకుని రాష్ట్ర సర్కారుకు నివేదిస్తారు. ఏదైనా సమస్య వెలుగు చూసినప్పుడు.. దానిని పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున కోమటి జయరాం ముందుంటారు. అదేవిధంగా రాష్ట్రానికి ఉత్తర అమెరికా నుంచి పెట్టుబడి దారులను తీసుకురావడం కూడా ఈయనకు బాధ్యతగా సీఎం చంద్రబాబు అప్పగించారు.
సుదీర్ఘంగా..
టీడీపీ తరఫున ఎన్నారై వ్యవహారాలు చూడడంలో కోమటి జయరాం సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. ప్రతి విషయాన్నీ ఆయన నిశితంగా గమనించడంతోపాటు.. అమెరికాలోనే కాకుండా.. దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల్లోనూ టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో ఏపీలో కూటమి సర్కారును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నారైలను రప్పించి ప్రచారం చేయించారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు విదేశాల్లో ఆయనకు అనుకూలంగా కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబుతో కోమటి జయరాంకు ఎనలేని అనుబంధం ఉందని పార్టీ నాయకులు అంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates