ఇటీవల అనారోగ్యంతో బాధపడి కోలుకున్న ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆయనను ఆత్మీయంగా పలకరించారు. సభలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాజకీయ హుందాతనానికి ఉదాహరణగా నిలిచింది.
సభా కార్యక్రమాల మధ్యలో బొత్స సత్యనారాయణను ఉద్దేశించి “బొత్స సత్యనారాయణ గారు నమస్కారం” అంటూ మంత్రి లోకేష్ పలకరించారు. ఆయన వినకపోవడంతో మండలి చైర్మన్ జోక్యం చేసుకుని “మంత్రి నారా లోకేష్ మిమ్మల్ని పరామర్శిస్తున్నారు” అని బొత్సకు తెలియజేశారు. వెంటనే స్పందించిన లోకేష్, “గురువుగారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా హౌస్కు రావడం ఆనందంగా ఉంది. వెల్కమ్ టు ది హౌస్” అని వ్యాఖ్యానించారు.
ఇటీవల బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల పర్యవేక్షణలో కొద్ది రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.
అనంతరం సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో స్పందించిన బొత్స, ఆందోళన అవసరం లేదని, తాను క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి సభకు వచ్చిన బొత్సను పలకరిస్తూ “మీ ఆరోగ్యం ఎలా ఉంది? మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది” అని మంత్రి లోకేష్ అడగడం సభలో చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో పరస్పర గౌరవం, మర్యాద చూపడం మంచి సంప్రదాయం అని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్ష నేత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో త్వరగా కోలుకోవాలని కోరుకున్న మంత్రి లోకేష్, ఆయన తిరిగి సభకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం రాజకీయాల్లో మానవీయ విలువలను ప్రతిబింబిస్తుందని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అయినప్పటికీ పరస్పర గౌరవంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates