ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా యుద్దం ప్రకటించడం.. ఇరాన్ కూడా బలంగానే పోరాటం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలు దేశాలు రెండుగా చీలిపోయాయి. రష్యా, చైనాలు ఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. ఇక, పాకిస్థాన్ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థను ఎదుర్కొంటోంది. యుద్ధం వద్దంటే.. అమెరికాకు కోపం.. కావాలంటే ఇరాన్కు కోపం.. అన్నట్టుగా పాక్ పరిస్థితి మారింది.
ఇక ప్రపంచ శాంతి దూతగా భారత్ను మలిచానని చెబుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన.. ఆరు రోజుల తర్వాత కానీ.. స్పందించలేదు. తాజాగా ఆయన స్పందిస్తూ.. సైనిక దాడులతో ఏ సమస్యా పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. అన్ని పక్షాలూ.. సంయమనం పాటించాలని సూచించారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుం టుందన్న ప్రధాని.. తాము శాంతి పక్షానే నిలుస్తామని తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో చర్చలకు సహకరించేందుకు ఏ చిన్న అవకాశం వున్నా.. భారత్ సహకరిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రపంచ దేశాలు యుద్ధాలను వీడాలని.. ప్రజల సంక్షేమం.. పశ్చిమాసియా అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలు అనేక ఆకాంక్షలతో ఉన్నారని.. వారి సమస్యల పరిష్కారమే అన్ని దేశాలకు ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. సైనిక చర్యల వల్ల సమస్యలు పెరుగుతాయే కానీ.. కొత్తగా పరిష్కారాలు కూడా లభించబోవన్నారు.
నొప్పించక….
అయితే.. తన సందేశంలో ప్రధాని మోడీ ఏ దేశాన్నీ నొప్పించలేదు.. ఏ దేశాన్నీ దువ్వలేదు. వాస్తవానికి ఇజ్రాయెల్, అమెరికాలకు తమకు భారత్ మద్దతుగా ఉంటుందన్న భావనతో ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసినప్పుడు.. “యుఆర్మై గ్రేట్ ఫ్రెండ్“ అంటూ నెతన్యాహూ పేర్కొన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు భారత స్పందన కోసం వేచి చూస్తున్నామన్నారు. మరోవైపు ఇరాన్ కూడా.. భారత్ స్పందన ఏంటనేది వేచి చూసింది. ఈ సమయంలో ఎవరినీ నొప్పించకుండానే ప్రధాని శాంతి మంత్రం జపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates