గ్రామీణ భారతంపై జనసేన సైలెంట్ వేవ్తో దూసుకుపోతోందా? ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితం అయిన జనసేన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పల్లె పండుగ-2.0ను మరింత ముందుకు తీసుకువెళ్లడం ద్వారా.. పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. వాస్తవానికి పల్లెలపై జనసేనకు పట్టు పెద్దగా లేదు.
అయితే.. తరచుగా పల్లెల పర్యటనతోపాటు.. కేంద్రం నుంచి ఇస్తున్న నిధులను నేరుగా పంచాయతీలకు విడుదల చేయడం ద్వారా పల్లెల్లో జనసేనకు సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకుంటున్నారు. ఒకప్పుడు పల్లెల్లో జనసేన గురించి పెద్దగా చర్చ ఉండేదికాదు. కానీ, ఇప్పుడు పవన్ కల్యాణ్ జపం ఎక్కువగా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
ఇది.. గ్రామీణ భారతంలో రూపు రేఖలను మార్చేస్తోంది. ఒకవైపు రహదారులను అభివృద్ధిచేయడంతో పాటు.. మరోవైపు.. పశువుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న గోశాలలు, నీటి సమస్య పరిష్కారానికి గ్రామీణ ఉపాధి పథకం కింద చెరువుల నిర్మాణం వంటివి గ్రామీణ స్థాయిలో మంచి మార్పునకు జనసేన ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి.. జనసేన మరింత పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
అయితే.. ఈ క్రమంలో కూటమి ధర్మానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్న నియమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. మూడు పార్టీలతరఫున ప్రజల మధ్యకు వెళ్లాలని.. పల్లెపండుగను మరింత విజయవంతం చేయాలని జనసేన నుంచి బలమైన సంకేతాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. పార్టీ పరంగా చేస్తున్న చర్యలు.. ప్రభుత్వ పరంగా చేస్తున్న అభివృద్ధిని చూపించి.. గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సైలెంట్ వేవ్గా ఉన్న జనసేన వ్యూహం ఫలిస్తుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates