మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు రాడ్డుతో పార్క్ చేసి ఉన్న రెండు కార్ల అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నారద నీలాద్రిగా గుర్తించారు. అతనికి మానసిక స్థితి సరిగా లేదనే సమాచారం ఉన్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యపై అర్జీ ఇవ్వడానికి ఇచ్ఛాపురం నుంచి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఆగ్రహానికి కారణాలు ఏమిటి? ముందస్తు ప్రణాళిక ఏదైనా ఉందా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు.
అత్యంత భద్రత కలిగిన పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ఓ వ్యక్తి రాడ్డుతో ఎలా ప్రవేశించగలిగాడు? గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేకపోయారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది భద్రతా వైఫల్యమా? లేక దీని వెనుక రాజకీయ కోణమా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, అదనపు బలగాలను మోహరించారు. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates