`లెస్స‌న్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఎన్ సీఈఆర్‌టీ సంస్థ‌.. 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని పెనుకుదుపున‌కు గురి చేసింది. `న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అవినీతి` పేరుతో తీసుకువ‌చ్చిన ఈ పాఠ్యాంశంపై వ‌రుస‌గా రెండో రోజు కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డింది. ఇది న్యాయ వ్య‌వ‌స్థ‌ను అవ‌మానించేందుకు.. కుట్ర‌పూరితంగా చేసిన చ‌ర్య‌గా పేర్కొంది. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టేది లేద‌ని తేల్చి చెప్పింది.

గురువారం మ‌రోసారి ఈ కేసు(సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారిస్తోంది)ను విచారించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బాధ్యుల‌ను శిక్షించి తీరుతామ‌ని వెల్ల‌డించింది. కాగా.. బుధ‌వారం జ‌రిగిన విచార‌ణ స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్.. కోర్టుకు సారీ చెప్పారు. దీనిపై శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. సుప్రీంకోర్టు శాంతించ‌లేదు.

ఎందుకింత సీరియ‌స్‌..

స‌ద‌రు పాఠ్యాంశంలో.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర ఉంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ ప‌డ‌డంతో ఈ కేసు చాలా సీరియ‌స్ అయింది. అంతేకాదు.. “ఈ పాఠ్యాంశం.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌యోగించిన బుల్లెట్‌“ అంటూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త‌ద్వారా న్యాయ‌వ్య‌వ‌స్థ ఈ రోజు ర‌క్తం చిందిస్తోంద‌ని పేర్కొంది.

న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపర్చేలా ఉద్దేశపూర్వకంగానే ఈ పాఠ్యాంశాన్ని చేర్చార‌ని పేర్కొన‌డం ద్వారా.. సుప్రీంకోర్టు ఏ స్థాయిలో దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోందో అర్ధం చేసుకోవ‌చ్చు.

పుస్త‌కంపైనే నిషేధం!

ఎన్ సీఈఆర్‌టీ ప్ర‌చురించిన 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో పేర్కొన్న పాఠ్యాంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోర్టు.. స‌ద‌రు పుస్త‌కంపైనే పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. కఠినచర్యలు త‌ప్పవని మ‌రోసారి కేంద్రాన్ని ఘాటుగా హెచ్చ‌రించింది.

అయితే.. కేంద్రం మ‌రోసారి సుప్రీంకోర్టును ప్రాధేయ ప‌డింది. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని.. పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ సుప్రీంకోర్టు శాంతించ‌లేదు.