తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్ అనేది తన హాబీ అని.. చూసేందుకు వెళ్లడం తప్పుకాదని చెప్పారు. తానేమీ ఇంట్లో కూర్చుని సభకు రాకుండా.. వ్యవహరించడం లేదని అన్నారు. తాను బాధ్యతగా పనిచేస్తున్నానని చెప్పారు. క్రికెట్ను ప్రధాన మంత్రినరేంద్ర మోడీ సైతం అనేక సందర్భాల్లో వీక్షించారని చెప్పారు. క్రికెట్ చూడడం తప్పుకాదని.. పబ్జీలాంటి ప్రమాదకర గేమ్స్ ఆడితేనే తప్పని వ్యాఖ్యానించారు.
తాను శ్రీలంకలో జరిగిన మ్యాచ్కు వెళ్లినా.. అక్కడకు వెళ్లేందుకు, వచ్చేందుకు అయిన ఖర్చును తానే భరించానని చెప్పారు. ఎవరి జేబులో సొమ్మును తాను ఖర్చు చేయలేదన్నారు. ప్రస్తుతం టీ-20 ప్రపంచ కప్ జరుగుతోందన్న లోకేష్.. ఫైనల్స్లోకి ఇండియా అడుగు పెడితే.. ఖచ్చితంగా దానిని చూసేందుకు కూడా తాను వెళ్తానన్నారు. జగన్ వస్తానంటే.. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకు కూడా టికెట్ బుక్ చేసి.. తీసుకువెళ్తానని వ్యాఖ్యానించారు.
ఇన్నాళ్లు ఏం చేశారు…
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభకు రాకుండా వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరును నారా లోకేష్ తప్పుబట్టారు. మరోవైపు మండలిలోనూ కార్యకలాపాలు సజావుగా సాగకుండా అడ్డు తగులుతున్నారని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లుగా మండలి జరుగుతున్నా(8 రోజులు) బడ్జెట్పై చర్చకు రాలేదని.. కానీ, ఇప్పుడు బడ్జెట్ పై చర్చ కోరుతున్నారని వ్యాఖ్యానించారు. బాధ్యత ఉంటే.. ఎప్పుడో బడ్జెట్పై చర్చకు ముందుకు వచ్చేవారని అన్నారు.
భారతీ సిమెంట్స్కు 1000 కోట్లు
వైసీపీ పాలనా కాలంలో సొంత మీడియా, సొంత వ్యాపార సంస్థలకు అనుచిత లబ్ధిని చేకూర్చుకున్నారని నారా లోకేష్ విమర్శించారు. వీటిపై విచారణకు ఆదేశిస్తామన్నారు. భారతీ సిమెంట్స్కు 1000 కోట్ల రూపాయల మేరకు మేలు జరిగేలా నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. హెరిటేజ్ సంస్థకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా మేలు జరగలేదని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates