రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఏదో ఒక రాష్ట్రం గురించి కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వనరులను ఉచిత పథకాల రూపంలో పంపిణీ చేయడం కంటే, ప్రజల జీవితాలను మెరుగుపరిచే పక్కా ప్రణాళికలతో ముందుకు రావాలని స్పష్టం చేసింది. నిరుద్యోగ నిర్మూలన వంటి దీర్ఘకాలిక ప్రయోజనం ఉండే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
ముఖ్యంగా దేశ ఆర్థిక అభివృద్ధికి ఇటువంటి ఉచితాల పంపిణీ పెద్ద అడ్డంకిగా మారుతుందని చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ బాధ్యత అనడంలో సందేహం లేదు, కానీ ఉచితాలను అనుభవిస్తున్న వారి విషయంలో పునరాలోచన అవసరమని పేర్కొన్నారు.
రాష్ట్రాలు ఇప్పటికే భారీ లోటు బడ్జెట్లో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ధనాన్ని ఇలా పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి ఏటా వసూలు చేస్తున్న ఆదాయంలో కనీసం 25 శాతాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు ఉపయోగించకూడదని కోర్టు నిలదీసింది. బడ్జెట్ ప్రతిపాదనలు చేసేటప్పుడు ఆ ఖర్చుకు సంబంధించిన సరైన కారణాలను చూపాలని కోరింది.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఎంత ఖర్చు చేస్తున్నారు, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటనేది స్పష్టంగా ఉండాలని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ వ్యాఖ్యానించారు. లోటులో ఉండి కూడా ఉచితాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు చేసేటప్పుడు ఒక పద్ధతి ఉండాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓటర్లను ఆకర్షించేందుకు తాత్కాలికంగా ఇచ్చే తాయిలాలు రాష్ట్రాల ఆర్థిక వెన్నెముకను దెబ్బతీస్తాయని గుర్తు చేసింది.
ప్రజల పన్నుల డబ్బును సరైన మార్గంలో, అంటే మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల కోసం ఖర్చు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
కేవలం ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీలపై ఉంది. మరి కోర్టు హెచ్చరికల తర్వాత అయినా రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates