అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే.. ఆడుకున్న టీడీపీ నేతలు

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు తొలిరోజు మాత్ర‌మే వ‌చ్చిన వైసీపీ స‌భ్యులు.. త‌ర్వాత పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌తో స‌భ‌కు దూరంగా ఉన్నారు. కానీ, కొంద‌రిలో మాత్రం స‌భ‌కు రావాల‌ని.. ప్ర‌జ‌ల స‌మస్యల‌పై ప్ర‌శ్న‌లు సంధించాల‌ని ఉన్న మాట వాస్త‌వం. ఎందుకంటే.. జ‌గ‌న్ లెక్క‌వేరు. ఆయ‌న నియోజ‌క‌వర్గానికి వెళ్లినా వెళ్ల‌క‌పోయినా.. చెల్లుతుంది. కానీ.. ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల్లో 8 మంది ప‌రిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్ర‌జ‌లకు దూర‌మైతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు త‌మ మొహం చూపించ‌లేమ‌న్న ఆవేద‌న‌లో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు ఎమ్మెల్యేలు ధైర్యం చేసి.. స‌భ‌కు వెళ్దామ‌ని.. ఏం జ‌రిగినా.. మ‌న మంచికేన‌ని చెబుతున్నారు. అయినా.. జ‌గ‌న్ మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే వ‌స్తామ‌ని చెబుతున్నారు. అంతే కాదు.. ముఖ్య‌మంత్రి స‌భ‌లో ఎంత సేపు మాట్లాడితే.. అంత సేపు త‌న‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. దీంతో ఇటు స‌భ‌కు.. అటు వైసీపీ స‌భ్యుల‌కు మ‌ధ్య ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సాగుతోంది.

మ‌రోవైపు.. స్పీక‌ర్ అయ్య‌న్న ప్ర‌వేశ పెట్టిన డిజిట‌ల్ హాజ‌రు విష‌యంలోనూ వైసీపీ స‌భ్యులు ఆందోళ‌న‌తో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా బుధ‌వారం వైసీపీ ఎమ్మెల్యే(ఎర్ర‌గొండ‌పాలెం) తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ స‌భ‌కు వ‌చ్చారు. అయితే.. ఆయ‌న స‌భ‌కు హాజ‌రు అవ్వాల‌ని భావించే వ‌చ్చారో.. లేక స‌భ గ్యాల‌రీలో కూర్చుని స‌భ‌ను వీక్షించాల‌ని వ‌చ్చారో తెలియ‌దు. ఇంత‌లోనే ఆయ‌న‌కు మంత్రులు ఎదుర‌య్యారు.

మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల‌కు..  వైసీపీ ఎమ్మెల్యే ఎదురు ప‌డ‌గానే.. ముందుగా మంత్రులు ఆశ్చ‌ర్య పోయారు. త‌ర్వాత‌.. ఇప్ప‌టికైనా వ‌చ్చినందుకు సంతోషం.. అని ప‌ల‌క‌రించారు. ఈ క్ర‌మంలో మంత్రు లకు, ఎమ్మెల్యేకు మ‌ధ్య ఓ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

బ‌డ్జెట్‌పై ప్ర‌శ్నించ‌కుండా.. ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారు? అని మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ప్ర‌శ్నించారు. మ‌రో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ రావు మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు చేస్తున్న బ‌డ్జెట్ వివ‌రాల‌ను అడ‌గాల్సింది పోయి.. బిల్ గేట్స్‌కు ఖ‌ర్చు పెట్టిన టీ-స‌మోసా ఖ‌ర్చులు అడుగుతున్నారెందుకు.. అని వ్యాఖ్యానించారు.

దీంతో వైసీపీ ఎమ్మెల్యే న‌వ్వుతూ.. “మీకు అంతా తెలిసే.. న‌న్ను ఆట‌ప‌ట్టిస్తున్నారు“ అంటూ.. అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ఈ ప‌రిణామం త‌ర్వాత‌.. మంత్రులు, ఎమ్మెల్యేల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. వైసీపీ ఎమ్మెల్యేల‌కు స‌భ‌కు రావాల‌నే ఉంద‌ని.. కానీ, జ‌గ‌న్ కార‌ణంగానే వారు రావ‌డం లేద‌ని.. ఇలాంటి పార్టీ అధినేత ఉండ‌డం వారి దుర‌దృష్ట‌మ‌ని మంత్రి వ్యాఖ్యానించారు.