ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు కావడం, మరే కేసులోనూ పీటీ వారెంట్ ను పోలీసులు కోరకపోవడంతో ఆయన కొద్ది సేపటి క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా అంబటిని కలిసేందుకు పలువురు వైసీపీ నేతలు జైలు దగ్గరకు వెళ్లారు.
ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమంగా, అన్యాయంగా జైల్లో పెట్టారని, తన పెళ్లాంబిడ్డలను చంపడానికి ప్రయత్నం చేశారని, అయినా భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
తాను మరింత పోరాటపటిమతో ముందుకు వెళతానని అన్నారు. తనను జైల్లో పెట్టారని, ఇప్పుడు ఏమయిందని ప్రశ్నించారు. బాధితుడిని జైల్లో పెట్టి నిందితులను వదిలేశారని ఆరోపించారు. తాను జైలు జీవితాన్ని అనుభవించలేదని, ఎంజాయ్ చేశానని అంబటి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాప పడ్డానని, తనలా ఎవరైనా చేశారా అని ప్రశ్నించారు. తన పార్టీ నేతలతోపాటు, తన పార్టీకి చెందని వారు కూడా తనకు మద్దతుగా నిలిచారని, వారందరికీ ధన్యవాదలు చెప్పారు అంబటి.
దేనికైనా సిద్ధపడి వైఎస్ఆర్, జగన్ వెంట నడుస్తానని…కూటమి ప్రభుత్వాన్ని కూల్చేవరకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలనైనా ఎదుర్కొంటానని అన్నారు.
బయటి భోజనం తినేందుకు కోర్టు ఆర్డర్ ఇవ్వలేదని, కాబట్టి జైలు అధికారులు వారి రూల్స్ ప్రకారం భోజనం పెట్టారని, కాబట్టి అది తనకు నచ్చకపోయినా తిన్నానని అన్నారు. దాడి సమయంలో అయితే పోలీసులు తనను పారిపోవాలని సలహా ఇచ్చారని కామెంట్స్ చేశారు. తాను ధైర్యాన్ని వీడను, వీడలేదని, ప్రాణాలకు తెగించే ఉన్నానని అన్నారు.
7 గంటల పాటు తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలో, రౌడీలో, గంజాయి బ్యాచో దాడి చేశారని, తనపై దాడిని చంద్రబాబు, లోకేశ్ మానిటర్ చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తనను జైల్లో పెట్టించి భయపెట్టాలని చూశారని, అటువంటి పిచ్చివారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంకా చాలా విషయాలు తనకు తెలియలేదని, పేపర్లో చదివి తెలుసుకున్న కొన్ని విషయాల గురించి మాత్రమే తాను ఇప్పుడు మాట్లాడానని అన్నారు. అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుంటానని, ఆ తర్వాత రేపు గుంటూరులో ప్రతి విషయం గురించి, తన బాధ గురించి మాట్లాతానని, అన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates