అమరావతిలో బాబుతో బిల్ గేట్స్ భేటీ, కారణమేంటి?

27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు భేటీ అయిన సందర్భం తెలుగు వారందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క మీటింగ్ ఏపీ, తెలంగాణలోని వేలాది మంది యువత భవితను మార్చేసింది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నేడు ఐటీ ఉద్యోగులుగా దేశవిదేశాల్లో స్థిరపడ్డారంటే అందుకు ఆనాటి ఆ ఒక్క మీటింగే కారణమనేది అనేక విశ్లేషకుల మాట. కట్ చేస్తే…27 సంవత్సరాల తర్వాత అమరావతిలో అదే బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు.

ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి వారు చర్చించారు.

గేట్స్ ఫౌండేషన్ సహాయసహకారాలతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టుల విస్తరణ గురించి కూడా వారు చర్చించారు. సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని బిల్‌గేట్స్‌ పరిశీలించారు. ఆర్టీజీఎస్‌ విధానాల గురించి గేట్స్‌కు చంద్రబాబు వివరించారు.

ఉండవల్లి దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో గేట్స్ టీం పర్యటించనుంది. సాగుకు సంబంధించిన విధానాలను పరిశీలించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టిన సాగు గురించి గేట్స్ టీంకు మంత్రులు వివరించనున్నారు.

అంతకుముందు, గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ కు మంత్రులు లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు, సత్య కుమార్‌ ఘన స్వాగతం పలికారు. అయితే, బిల్‌గేట్స్ ప్రయాణించిన విమానం ల్యాండింగ్‌కు పొగమంచు కారణంగా ఇబ్బందులు వచ్చాయి. ఏటీసీ క్లియరెన్స్ రాకపోవడంతో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత క్లియరెన్స్ ఇవ్వడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.