జనగణమన పాడి జగన్ వాకవుట్

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ మొదలైంది. అందరూ అనుకున్నట్లుగానే ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ సభ్యులు సభకు అటెండెన్స్ కోసం హాజరయ్యారు.

పట్టుమని 10 నిమిషాలు కూర్చోకుండా వాకౌట్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకోవాలని చూశారు.

గవర్నర్ ప్రసంగానికి గౌరవమిచ్చి కూర్చోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు హితవు పలుకుతున్నా వారు వినలేదు. ఆ తర్వాత లడ్డూలో కల్తీ నెయ్యి అంశం, మెడికల్ కాలేజీల పీపీపీ అంశానికి నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకునేందుకు, 6 నెలల హాజరు నిబంధనను సంతృప్తి పరిచేందుకు సభకు హాజరయ్యాం అనిపించుకొని జంప్ అయ్యారు.

అయితే, ప్రత్యేకంగా వైసీపీ సభ్యుల కోసమే అన్నట్లు అసెంబ్లీ చరిత్రలో తొలిసారి డిజిటల్ అటెండెన్స్ విధానం తీసుకువచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. గతంలో అయితే అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోతే సరిపోయేది. కానీ, వైసీపీ సభ్యులు సభకు రాకుండా మొహం చాటేస్తూ సంతకం పెట్టి అటు నుంచి అటు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఫేషియల్ రికగ్నిషన్‌ ద్వారా అసెంబ్లీలో సభ్యుల అటెండెన్స్ తీసుకోవాలని కొత్త రూల్ తెచ్చారు.

అంటే ఇకపై, అసెంబ్లీకి వచ్చి లోపల కూర్చుంటేనే అటెండెన్స్ కౌంట్ అవుతుంది. ఇకపై అటెండెన్స్ రిజిస్టర్‌లో హాజరు పద్దతి ఉండదని ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. కాగా, అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ తో పాటు వైసీపీ సభ్యులంతా ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు.

తమకు ప్రతిపక్షంగా గుర్తింపునివ్వరని, ఏపీలో ప్రజా సమస్యలపై, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరని జగన్ ప్లకార్డు పట్టుకొని నిరనస వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ నిరసనలో పాల్గొని రాని ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలు చేశారు.