సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటికే అంబటిపై మరో 8 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం అంబటిపై 44 కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటికి గుంటూరు కోర్టు తాజాగా 14 రోజుల రిమాండ్ విధించింది.
ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు పిలుపునివ్వగా…అందులో భాగంగా అంబటి కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆ క్రమంలో పోలీసుల విధులకు అంబటి ఆటంకం కలిగించారని నవంబర్ 12న అంబటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తాజాగా ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ తీసుకున్న పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు అంబటిని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే అంబటికి గుంటూరులోని స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో, మళ్లీ అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు.
అంబటిని వేధించేందుకు ఇలా పాత కేసుల్లో పీటీ వారెంట్ లు తీసుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అంబటిని తిప్పి టార్చర్ పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది.
అయితే, వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి ఆ తర్వాత వేరే కేసులు పెట్టి పీటీ వారెంట్ లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అంబటి జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates