భారత్ కు చిరకాల మిత్రుడు దూరం అవుతున్నాడా?

భారత్ కు ఇబ్బంది ఎదురైతే తాను అండగా ఉన్నట్లుగా వ్యవహరించే రష్యా.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇటీవల యూఎస్ తో జరిగిన వాణిజ్య డీల్ మాస్కోకు కోపం తెప్పించిందా? భారత్ కు చిరకాల మిత్రుడిగా ఉన్న రష్యా ఇప్పుడు భారత్ కు క్రమక్రమంగా దూరమవుతుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

దీనికి ప్రధాన కారణం.. తాజాగా పాక్ లో చోటు చేసుకున్న పరిణామాలపై పాక్ ప్రధానికి రష్యా అధినేత పుతిన్ చేసిన మెసేజ్.. కొత్త చర్చకు తెర తీసినట్లైంది.

ఇంతకాలం పాక్ లో ఏం జరిగినా.. తమకు పట్టనట్లుగా వ్యవహరించే పుతిన్.. అందుకు భిన్నంగా పాక్ లోని ఇస్లామాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఆత్మాహుతిదాడి అంశంపై స్పందించారు. ఉగ్రదాడిలో 36 మంది మరణించిన ఈ ఉదంతంపై రష్యా అధినేత పుతిన్ స్పందిస్తూ.. ‘మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపటం ఉగ్రవాదుల క్రూరమైన.. అమానవీయమైన మైండ్ సెట్ ను తెలియజేస్తుంది’’ అని పేర్కొంటూ పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ఆ దేశ ప్రధాని షెహాబాజ్ షరీప్ లకు సంతాప సందేశాల్ని పంపారు.

అంతేకాదు.. పాకిస్థాన్ తో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని రష్యా వెల్లడించింది. ఇదంతా చూస్తే.. పాక్ తో కలిసి పుతిన్ కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా ఉంది.

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఒక ఉదంతాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో పుతిన్ కోసం పాక్ ప్రధాని దాదాపు 40 నిమిషాలు వెయిట్ చేయాల్సి రావటం.. ఈ సందర్భంగా పుతిన్ తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

కట్ చేస్తే.. తాజాగా అదే రష్యా అధినేత తనకుతానుగా పాక్ ప్రధాని.. అధ్యక్షులకు మెసేజ్ పెట్టటం.. తాము పాక్ తో పని చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న తీరు చూస్తే.. ట్రంప్ ఒత్తిడికి మోడీ సర్కారు వ్యవహరించిన తీరుపై రష్యా సానుకూలంగా లేదంటున్నారు.

అయితే.. అమెరికాతో డీల్ పై కుదిరిన ఒప్పందంపై మాత్రం రష్యా తన మనసులోని మాటను నేరుగా బయటపెట్టలేదంటున్నారు. మొత్తంగా.. భారత్ కు దీర్ఘకాలంగా నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉన్న రష్యా ఇప్పుడు అందుకు భిన్నంగా దూరం అవుతున్నట్లుగా వస్తున్న సంకేతాల విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందంటున్నారు.