ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అత్యంత కీలకమైన చర్చ శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ కావడమే!. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం చర్చకు వస్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని.. ఢిల్లీలో వెల్లడించిన దరిమిలా.. ఇప్పుడు పలు ధార్మిక సంఘాలు, మఠాలు కూడా స్పందిస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు దీనిని రాజకీయ కోణంలోనే చూసిన వారు కూడా.. ఇప్పుడు ఆ ముసుగు పోయిందని.. దేవ దేవుడి పవిత్ర ప్రసాదం కల్తీ అయిందన్న కోణంలోనే చర్చ సాగుతోందని అంటున్నారు.
అంతేకాదు.. అసలు వైసీపీ హయాంలోనే ఎన్డీడీబీ నివేదికతోపాటు.. ఎఫ్ ఆర్ టీ నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో దానిని ఎందుకు ఉపేక్షించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సమంజసంగా లేవని అంటున్నారు.
లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారన్న నివేదిక ఇచ్చారని.. కానీ, అది తనకు రాలేదని.. అధికారులు, కొందరు ఉద్యోగులు కూడబలుక్కుని ఏదో చేశారని ఆయన చెప్పారు. ఇది అంత నమ్మశక్యంగా లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ హోదాలో ఉన్న వైవీ.. సదరు అధికారులను ఎందుకు అడ్డుకోలేక పోయారన్నది ప్రశ్న.
అంతేకాదు.. ఒకవేళ అధికారులు అడ్డుపడితే.. ఆయన ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు? పోనీ.. మీడియా ముఖంగా అయినా.. ఈవిషయాన్ని చెప్పి.. కల్తీకి అడ్డుకట్ట ఎందుకు వేయలేదు? అనేది సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి.
ఇక, వైవీ పీఏ చిన్న అప్పన్న వ్యవహారంపైనా సుబ్బారెడ్డి స్పందించాల్సి ఉంది. చిన్న అప్పన్న ఖాతాలో 4.23 కోట్ల రూపాయలు ఎందుకు వచ్చి చేరాయి? ఆయనకు ఎలాంటి సంబంధం ఉంది? అనే విషయాలు తేలితే..అసలు దోషులు ఎవరు అనేది స్పష్టమవుతుంది.
అదేసమయంలో నివేదికను ఎందుకు తొక్కి పెట్టారన్న వాదన విషయంలోనూ వైవీ సుబ్బారెడ్డి మౌనం పాటించడం తనకు సంబంధం లేదని చెప్పడం వంటివి కూడా ప్రశ్నలుగానే మారుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
