అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు సంఘీభావంగా ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు.

అయితే కాపు నేత అయిన అంబటి రాంబాబు పై దాడిని వైసీపీలోని కాపు నేతలతో పాటు మిగతా నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు మద్దతుగా వైసీపీలోని కాపు నేతలైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ఛలో గుంటూర్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 300 కార్లతో విశాఖ నుంచి గుంటూరుకు భారీ ర్యాలీగా వచ్చారు.

వారే దాడి చేసి వారే కేసులు పెట్టి… వైసీపీ నేతలను వేధించడం ప్రభుత్వానికి అలవాటైందని అమర్నాథ్ విమర్శించారు. అంబటి రాంబాబును, ఆయన కుటుంబ సభ్యులను హతమార్చాలని చూశారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇటువంటి హింసను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

అంబటి రాంబాబు, జోగి రమేష్ లకు జగన్ తో పాటు రాష్ట్రంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు అండగా ఉన్నారని చెప్పేందుకే ఛలో గుంటూర్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే పార్టీ నేతలంతా అండగా ఉంటారని తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.

టీడీపీ ముందు నుంచి కాపు నేతలకు వ్యతిరేకమని కరణం ధర్మశ్రీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్య, ముద్రగడపై హత్యా ప్రయత్నం అందుకు నిరసనమని సంచలన ఆరోపణలు చేశారు. కాపు నేతల వాయిస్ వినిపిస్తున్న అంబటి వంటి వారిపై దాడులు చేస్తున్నారని ధర్మశ్రీ మండిపడ్డారు. కాపు నేతలను అణగదొక్కేందుకు చంద్రబాబు చూస్తున్నారని, కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

అయితే గతంలో చాలాసార్లు తన సొంత కులాన్నే దూషించిన అంబటి రాంబాబుకు ఎలా మద్దతు ఇస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.