టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా ముందు మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలని దీపక్ రెడ్డికి టీడీపీ అధిష్టానం పలుమార్లు హెచ్చరించింది. అయినా సరే ఆయన తీరు మారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే దీపక్ రెడ్డి మరోసారి తన కామెంట్లతో కాంట్రవర్సీకి కేరాఫ్గా మారి పార్టీ పరువు తీశారు. పార్లమెంట్లో ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీలు కొరికే అవకాశాలున్నాయంటూ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకింగ్గా మారాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం సమయంలో ఆయనను కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు అడ్డుకున్న ఘటనపై ఓ జాతీయ న్యూస్ ఛానెల్లో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడిన దీపక్ రెడ్డి మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. మోదీపై విపక్ష పార్టీల మహిళా ఎంపీలు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది.
అయితే ఆ సమయంలో ఆ మహిళా ఎంపీల వద్ద ఆయుధాలు లేవు కాబట్టి తమ పళ్లనే ఆయుధాలుగా చేసుకుని మోదీని కొరికి దాడి చేసే అవకాశముందని దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకింగ్గా మారాయి. ఆయన కామెంట్లు విన్న యాంకర్ అవాక్కయ్యారు. “మోదీని మహిళా ఎంపీలు కొరికే అవకాశముందని మీరు అన్నారా?” అని ఆమె ప్రశ్నించారు. అయితే పొరపాటున స్లిప్ అయ్యానని చెప్పకుండా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్డీఏ మిత్రపక్ష అధికార ప్రతినిధి అయిన దీపక్ రెడ్డి సిల్లీ కామెంట్స్కు ఎలా రియాక్ట్ కావాలో తెలియక ఆ యాంకర్ బిక్కమొహం వేసింది.
జాతీయ స్థాయిలో టీడీపీ పేరు ప్రతిష్టలను దిగజార్చేందుకు దీపక్ రెడ్డి కంకణం కట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన ఈ తరహా కామెంట్లు చేసి నవ్వులపాలు కావడం తొలిసారి కాదు.
గత ఏడాది డిసెంబరులో ఇండిగో విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో రిపబ్లిక్ టీవీ ఛానెల్లో అర్నాబ్ గోస్వామి డిబేట్లో కూడా ఆయన ఇటువంటి ఆణిముత్యాలు వదిలారు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్లు వార్ రూమ్లో ఇండిగో సంక్షోభ పరిస్థితిని సమీక్షిస్తున్నారని హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కామెంట్లు విని షాక్ అయిన అర్నాబ్ వెంటనే తేరుకుని లోకేశ్కు ఇండిగో సంక్షోభంతో సంబంధమేంటని ప్రశ్నించారు. అయినా దీపక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు.
ఆ తర్వాత డిబేట్లో టీడీపీకి కేటాయించిన సీటులో ఎవరూ రాలేదంటూ అర్నాబ్ విమర్శించారు. ఆ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారేలా ఉండడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి చక్కదిద్దాల్సి వచ్చింది.
ఇక ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి పట్టిన గ్రహణమంటూ కలెక్టర్లపై గతంలో దీపక్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన కూతురి పెళ్లికి రూ.1000 కోట్ల కట్నం ఇస్తానని స్వయంగా తనతో చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా దొంగలు వ్యవస్థలో చాలా మంది ఉన్నారంటూ కలెక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక సీడ్ ఏపీ ఛైర్మన్ అయిన తనకు 14 నెలలుగా జీతం రావడం లేదని ఆరోపించి సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు దీపక్ రెడ్డి. ఇలా దీపక్ రెడ్డి నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు పార్టీని ఇరకాటంలో పడేయడమే కాకుండా జాతీయ స్థాయిలో టీడీపీ, బీజేపీల మధ్య గ్యాప్ పెంచేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా దీపక్ రెడ్డి కామెంట్లకు కళ్లెం వేయకుంటే భవిష్యత్తులో మరింత డ్యామేజీ తప్పదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
