టీటీడీకి కొత్త ఈవో.. సవాళ్ల స్వాగతమేనా?!

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన శ్రీవారికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో శ్రీవారి ఇంచార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పనిచేశారు.

ఈ సందర్భంగా ముద్దాడ మాట్లాడుతూ తాను కూడా సామాన్య భక్తుడినేనని తెలిపారు. సామాన్య భక్తుడిగా భక్తులకు సేవ చేసే భాగ్యం కల్పించారని అన్నారు. మెజారిటీ దర్శనాలను సామాన్య భక్తులకు దక్కేలా కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల అందించడంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.

సమస్యలు ఇవీ..

అయితే కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రధానంగా కోర్టుల తీర్పులను అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పరకామణిలో చోరీ ఘటన అనంతరం హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. శ్రీవారి కానుకలను ఎలా లెక్కించాలన్న విషయంలో స్పష్టమైన సూచనలు చేసింది. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈవోపై ఉంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కమిషన్ వేయనుంది. ఈ కమిషన్ రాష్ట్ర పరిధిలోనే పని చేయనుంది. దీంతో ఆ కమిటీకి కూడా ఈవోగా ముద్దాడ సహకరించాల్సి ఉంటుంది.

సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అందిపుచ్చుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేయడం కూడా కీలకం. ఇవన్నీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడకు సవాళ్లుగానే నిలవనున్నాయి. అలాగే చైర్మన్ బీఆర్ నాయుడుతో సమన్వయం కూడా ముఖ్యంగా ఉండనుంది.