వైసీపీ అధినేత జగన్ పర్యటనలు ప్రజలకు గుదిబండలుగా మారాయా? ఆయన బయటకు వస్తుంటే.. తమకు ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ పర్యటన పెట్టుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు పై చేసిన దుర్భాషల నేపథ్యంలో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరు పర్యటన పెట్టుకున్నారు. కానీ, గత అనుభవాల నేపథ్యంలో గుంటూరును పోలీసులు అష్టదిగ్భంధం చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. బారికేడ్లు పెట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు జగన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ వస్తుంటే.. తమ గుండెల్లో దడ పుడుతోందని.. గుంటూరు వాసులు.. పలు ఆన్లైన్ మీడియా ఛానెళ్లకు ఇచ్చిన బైట్లలో చెబుతున్నారు.
ఇక, జగన్ పర్యటించనున్న మార్గాల్లోని అన్ని దుకాణాలను కూడా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు మూసి వేయించారు. దీంతో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. మరోవైపు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు.. వారికి ముందస్తు హెచ్చరికలు, నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు.. బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ ఏసురత్నం వంటివారికి నోటీసులు ఇచ్చారు.
కాగా.. గతంలో జగన్ పర్యటించినప్పుడు.. ఆ పార్టీ కార్యకర్త ఒకరు.. జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దీనిపై విచారణ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు భయం గుప్పిట్లో ఉన్నారన్నది సమాచారం. ఒక నాయకుడు పర్యటించడం ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఈ పర్యటనను ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చేయడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates