మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాడు వీడు అంటూ సంబోధిస్తూ…లోకేశ్ ను అసభ్య పదజాలంతో జోగి రమేశ్ దుర్భాషలాడారు. ఓ వైపు సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే జోగి రమేశ్ ఈ తరహాలో వ్యాఖ్యానించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగ్రహం రెట్టింపైంది.

ఈ నేపథ్యంలోనే జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. జోగి రమేశ్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఆ సమయంలో జోగి రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఈ క్రమంలోనే జోగి రమేశ్ ఇంటి దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. మరోవైపు, వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ దాడి ఘటనపై జోగి రమేశ్ స్పందించారు. తన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా సరే జోగి రమేశ్ తీరు మారినట్లు కనిపించడం లేదు. మరోసారి లోకేశ్, చంద్రబాబులపై అసభ్యకర పదజాలంతో జోగి రమేశ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

‘‘ లోకేష్.. నీ పిల్ల చేష్టలకు, నీ వెర్రి చేష్టలకు నేను భయపడను…నీ అయ్య, నువ్వు, నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందింది చాలక.. నా ఇంటి మీద పెట్రోల్ బాంబుతో దాడి చేస్తారా? సిగ్గు, శరం వదిలేసి సన్నాసుల్లాగ తయారయ్యారు.. ఏం పనులురా ఇవి, పనికి మాలినోడా.. పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిస్తా’’ అంటూ జోగి రమేశ్ మరోసారి బూతు పురాణం మొదలుబెట్టారు.

అంతేకాదు, లోకేశ్, చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలను జోగి సమర్థించుకోవడం విశేషం. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, తానేం చేశానని తన ఇంటిపై దాడి చేశారంటూ జోగి రమేశ్ అమాయకంగా ప్రశ్నించారు. టీడీపీ కల్తీ పార్టీ అని…కల్తీ టీడీపీకి అధ్యక్షుడు చంద్రబాబు అని, లోకేశ్ కు కొవ్వు తగ్గలేదని, చిప్ దొబ్బిందని తాను అన్న మాట వాస్తవమేనని, అందులో తప్పేంటని ప్రశ్నించారు జోగి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమని లోకేశ్ గుర్తు పెట్టుకోవాలని, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని వార్నింగ్ ఇచ్చారు.