పబ్లిక్ పల్స్ పట్టుకున్న పురంధేశ్వరి

క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతున్న కొద్దీ, వాటిపై విధిస్తున్న అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. 24 శాతం నుంచి 48 శాతం వరకు, కొన్ని సందర్భాల్లో 55 శాతం కంటే ఎక్కువగా వడ్డీలు వసూలు చేయడం వినియోగదారులను అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు వడ్డీలపై నియంత్రణ అవసరమని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి లేవనెత్తిన అంశం ప్రజలకు ఊరట ఇస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగదారుల రక్షణకు కఠిన నియమాలు అమలులో ఉన్నాయన్నది వాస్తవం. అమెరికాలో క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదన రావడం అక్కడి పాలకుల దృష్టిని సూచిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం మార్కెట్ స్వేచ్ఛ పేరిట బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇష్టానుసారంగా వడ్డీలు, ఛార్జీలు విధిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 

మనదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉంది.  ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ని కలిసి పురంధేశ్వరి వినతిపత్రం అందజేశారు. క్రెడిట్ కార్డ్ వడ్డీలపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మేలైన ప్రతిపాదన చేశారంటూ ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.