బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన తరంతో పోలిస్తే.. చాలా మంది రాజకీయ నాయకులు.. తమవారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. బీజేపీలో ఉన్నారా.. వేరే పార్టీల్లో ఉన్నారా? అనేది పక్కన పెడితే.. మొత్తంగా వెంకయ్య తరం నాయకులు .. చాలా మంది తమ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.. కానీ, వెంకయ్య మాత్రం తన పిల్లలను దూరంగా ఉంచారు. ఈ విషయం తరచుగా చర్చకు వస్తూనే ఉంది.
అయితే.. ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న బీజేపీ నాయకులు దత్రాత్రేయ, అమిత్ షా, మోడీ వంటి వారు(ఇటీవల ఈయన కుమార్తె కూడా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు) రాజకీయాల్లో వారసులను ప్రోత్సహించడం లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఒడిశా గవర్నర్గా ఉన్న కంభంపాటి హరిబాబు కూడా.. గతంలో విశాఖ ఎంపీగా బీజేపీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఆయన కూడా తన పిల్లలను తీసుకురాలేదు. ఇలానే.. వెంకయ్య కూడా తన పిల్లలను తీసుకురాలేదేమో.. అని అందరూ అనుకున్నారు. కానీ, అసలు వాస్తవం ఏంటనేది ఆయన తాజాగా వెలుగులోకి తీసుకువచ్చారు.
తన తరంతోనే పటిష్ఠమైన రాజకీయాలు అంతరించాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పారదర్శక విధానంలో ప్రజలకు సేవలు అందించే నాయకులు తగ్గిపోతున్నారని అన్నారు. అంతేకాదు.. ఒకప్పుడు ప్రజలకు ఇచ్చేందుకు నాయకులు ఉండేవారని..తమ తమ ఆస్తులను అనేక మంది నాయకులు ప్రజలకు పంచారని.. పుచ్చల పల్లి సుందరయ్య వంటి వారి పేర్లను తాజాగా వెంకయ్య ఉదహరించారు. అయితే.. రాను రాను రాజకీయాల్లోకి వస్తున్న వారిలో స్వార్థం పెరిగిపోయిందని.. ఇది ప్రజల ఆస్తులను కూడా దోచుకునేలా ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు.
అందుకే తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురాలేదని వెంకయ్య అన్నారు. “రాజకీయాల్లోకి వస్తానని నా పిల్లలు అడిగేవారు. ఒకప్పుడు ఆలోచించాను. కానీ, తర్వాత కాలంలో రాజకీయాలు మారిపోయాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం.. దూషించుకోవడం.. మోసం చేయడం వంటివి పెరిగాయి. ఇక, స్వార్థం కూడా పెచ్చరిల్లింది. అందుకే.. ఎందుకొచ్చిందిరా.. అని అనుకుని.. నా పిల్లలను రాజకీయాల్లోకి రావద్దన్నాను“ అని వెంకయ్య హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates