క‌ల‌లో కూడా ఊహించ‌ని కాంగ్రెస్‌ – బీజేపీ పొత్తు

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. నిత్యం ఉప్పు-నిప్పుగా ఉండే.. రెండు రాజ‌కీయాలు.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మె త్తిపోసుకునే రాజకీయ పార్టీలు.. చేతులు క‌లిపాయంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. అంతేకాదు.. ఒక‌పార్టీపై మ‌రోపార్టీ నిరంత‌రం విమ‌ర్శ‌లు చేసుకునే బీజేపీ-కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయంటే.. క‌ల‌లో కూడా ఊహించ‌లేం. కానీ.. రాజ‌కీయ అవ‌స‌రాలు.. ఈ రెండు.. పార్టీల‌ను క‌ల‌ప‌డం విశేషం. అయితే.. ఇదేదో రాష్ట్ర‌స్థాయి ఎన్నిక కోసం కాదు!. కేవ‌లం మేయ‌ర్ సీటు కోస‌మే!.

అయినా.. రెండు వైరుధ్య పార్టీలు చేతులు క‌ల‌పడం.. ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డం వంటి వార్తలు దేశ‌వ్యాప్తంగా అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే…. మ‌హారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న అంబ‌ర్‌నాథ్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఇటీవల జ‌రిగాయి. అయితే.. ఏ పార్టీకి మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు కావాల్సినంత మెజారిటీ ద‌క్క‌లేదు. అయితే.. ఈ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

త‌న మిత్ర‌ప‌క్షం.. ఉప ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన‌తో బీజేపీ సంప్ర‌దింపులు జ‌రిపింది. కానీ.. మేయ‌ర్ పీఠం రెండున్న‌రేళ్ల‌పాటు త‌మ‌కు ఇస్తామంటే.. ఓకే చెబుతామంటూ.. శివ‌సేన మెలిక పెట్టింది. వాస్త‌వానికి బీజేపీ-శివ‌సేన‌(షిండే) క‌లిసి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. అయినా.. మేయ‌ర్ పీఠానికి వ‌స్తే.. మాత్రం ఎవ‌రికి వారుగా భీష్మించారు. ఈ క్ర‌మంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల‌కు చ‌ర్చ‌లు జ‌రిపింది.

షిండే వ‌ర్గానికి మేయ‌ర్ పీఠం ద‌క్కకూడ‌దు.. అన్న ఏకైక ల‌క్ష్యంతో ఈ తూర్పు-ప‌డ‌మ‌ర‌ల వంటి పార్టీల మ‌ధ్య పొత్తు చిగురించింది. బీజేపీకి చెందిన 16 మంది కార్పొరేటర్ల‌కు, కాంగ్రెస్‌కు చెందిన 12 మంది కార్పొరేట‌ర్ల‌కు మ‌ధ్య సంధి కుదిరింది. ఈ క్ర‌మంలో తొలి మూడేళ్ల‌పాటు బీజేపీ అభ్య‌ర్థి తేజ‌శ్రీ మేయ‌ర్‌గా ఉండ‌నున్నారు. చివ‌రి రెండేళ్ల‌లో ఏడాదిన్న‌ర‌పాటు.. కాంగ్రెస్ అభ్య‌ర్థి, చివ‌రి ఆరు మాసాలు.. డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్య‌ర్థి మేయ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సో.. మొత్తానికి రాజ‌కీయాల్లో పొత్తులు.. ప‌ద‌వుల కోసం వేసే ఎత్తులు ఏ రేంజ్‌లో ఉంటాయ‌న‌డానికి ఇది ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అంటున్నారు ప‌రిశీల‌కులు.