విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన నియోజకవర్గంలో చేపడుతున్న పనులను నిశితంగా పరిశీలించడంతోపాటు ఆయా పనులకు అవుతున్న ఖర్చులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అవసరాలను పసిగట్టి దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. అధికారులు చెప్పారని, స్థానికంగా ఉన్న నాయకులు వచ్చి కోరారని కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను స్వయంగా తెలుసుకుని ఆయా పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
తద్వారా ప్రజలకు అవసరమైన విధంగా ప్రజలు కోరుకుంటున్న విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సుజనా చౌదరి కీలకపాత్ర పోషిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో అధికారులు చెప్పిందే వేదంగా నాయకులు భావిస్తూ ఉంటారు. వారు చెప్పిన మేరకు నిధులు కేటాయించటం పనులు చేయించడం వంటివి కామన్ గా మారుతున్నాయి. కానీ, దీనికి భిన్నంగా సుజనా చౌదరి మాత్రం నియోజకవర్గంలో అవసరాలను స్వయంగా తెలుసుకుని వాటికి మాత్రమే ప్రాధాన్య ఇస్తున్నారు.
ఇటీవల పశ్చిమ నియోజకవర్గంలో 80 లక్షల రూపాయలతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు ఆయనకు సూచించారు. కానీ దీనిని స్వయంగా పరిశీలించిన సుజనా చౌదరి తన వ్యక్తిగత ఇంజనీర్లు అదేవిధంగా వ్యక్తిగత సిబ్బందితో అంచనాలు రూపొందించి 80 లక్షలు ఎందుకు ఖర్చు అవుతుందని నిలదీశారు. ఇది కేవలం 40 నుంచి 50 లక్షల్లో పూర్తి చేయవచ్చని ఆయన తేల్చి చెప్పారు. ఆ పనులను చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లను కూడా తప్పించి తక్కువ ఖర్చుకు అయ్యేలాగా కాంట్రాక్టర్లను ఒప్పించారు.
ఇది ఒక వైపు ప్రభుత్వం నిధులను పరిరక్షించడంతోపాటు ప్రజలకు నాణ్యమైన పనులు అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు కూడా దోహద పడిన నిర్ణయంగా చెప్పాలి. ఇదే పద్ధతిని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చేపడితే ప్రభుత్వానికి సొమ్ము ఆదా అవుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా నాణ్యమైన పనులు చేకూరుతాయి. మొత్తంగా సుజనా చౌదరి చేస్తున్న ఈ పనులు స్థానికంగా ప్రజల మధ్య ఆసక్తికర చర్చకు దారి తీసాయి. ముందు ముందు కూడా ఆయన ఏ విధంగానే వ్యవహరించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates