మీ అకౌంట్లోకి 50 వేలు..ఇది స్కీం కాదు స్కాం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ కేంద్రంగా ఊహించ‌ని ఆస‌క్తిక‌ర ప్ర‌చారం జ‌రుగుతోంది. పైకి ఇది ఎంతో ఆక‌ర్ష‌ణీయంగానే ఉన్న‌ప్ప‌టికీ…లోలోప‌ల ప్ర‌మాద‌క‌ర‌మైన స్కీం కావ‌డం గ‌మ‌నార్హం. ఇంకా చెప్పాలంటే స్కీం పేరుతో జ‌రుగుతున్న స్కాం.

లాక్ డౌన్ కార‌ణంగా నిరుపేద‌ల‌కు ఎటువంటి ప‌నులు దొర‌క్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద‌ల‌ను ఆదుకునేందుకు కేంద్రం రాష్ట్రీయ శిక్షిత్ బెరోజ్గార్ యోజ‌న పేరుతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించిందంటూ ఓ మెసేజ్ స‌ర్క్యులేట్ అవుతోంది. పైల‌ట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ ప‌థ‌కం రేష‌న్ కార్డు ఉన్న వారికి మాత్ర‌మేన‌ని, వెంట‌నే రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని పేర్కొంటున్నారు. అయితే, ఇది పెద్ద స్కాం.

సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ఈ ప్ర‌చారం ప్ర‌కారం, రేష‌న్ కార్డు క‌లిగి ఉన్న‌ రోజువారీ కూలీలు, రైతులు, నిరుద్యోగ యువ‌త‌కు నేరుగా అకౌంట్ లో రూ.50 వేలు డిపాజిట్ చేయ‌బోతోంద‌ని, అయితే 40 వేల మందికి మాత్ర‌మే ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌బోతోంద‌ని, ముందుగా ఆర్ఎస్బీవై వెబ్ సైట్ లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారికే ఈ చాన్స్ అంటూ వాట్సాప్, సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతోంది. అయితే, ఇదంతా ఓ స్కామ్‌. భార‌త‌ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చింది.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఏర్పాటు చేసిన ఓ వేదిక ద్వారా, కేంద్రం రూ.50 వేల ఆర్థిక సాయం చేసేందుకు ఎటువంటి స్కీమ్ ప్రారంభించ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి మెసేజ్‌ల‌ను న‌మ్మొద్ద‌ని, ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని స్ప‌ష్టం చేసింది. అందులో చెప్పిన‌ట్టుగా ఎటువంటి వెబ్ సైట్ల‌లోనూ వ్య‌క్తిగ‌త వివ‌రాల న‌మోదు గానీ, ఫీజు చెల్లింపులు కానీ చేయొద్ద‌ని సూచించింది. ఒక‌వేళ వివ‌రాలు ఇస్తే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని పేర్కొంది.