ఆ ‘స్పీడ్’ ఏంటి బాబు గారు?

టీడీపీ అధినేత. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 అంటూ 2020లో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని ఆనాడే అంచనా వేసిన దార్శనీకుడు చంద్రబాబు. దేశవ్యాప్తంగా విజనరీ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు వినూత్న సంస్కరణలు, ఆలోచనలతో పాలనను పరుగులు పెట్టిస్తుంటారు.

ఫైళ్లు, దస్త్రాలతో నిండిన ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లు, బయోమెట్రిక్ అటెండన్స్ రావడం చంద్రబాబు చలవే. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో సేవలను, ప్రభుత్వ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంతో పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు.

అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని రెవెన్యూ శాఖ, జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై సచివాలయంలో ఏపీ సిఎస్ విజయానంద్ పాటు ఆ శాఖల ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం ద్వారా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.

సుస్థిరాభివృద్ధితోపాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను కూడా సాధించేందుకు అవసరమైన అంశాలపై చంద్రబాబు చర్చ జరిపారు. ఇక, ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని, తక్కువ ఖర్చుతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత వంటివి ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. జీరో పోవర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ వంటి అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.