తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన శపథం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఎట్టిపరిస్థితిలోనూ మరోసారి అధికారం దక్కనివ్వనని.. ఇది తన శపథమని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోసిగిలో నిర్వహించిన కాంగ్రెస్ మద్దతు దారులైన సర్పంచ్ల సన్మాన సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
వచ్చే ఎన్నికల్లో రెండింట మూడు వంతుల మెజారిటీతో కూడా కాంగ్రెస్ విజయం దక్కించుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకే ఎన్నికలు జరిగితే.. 80 చోట్ల, నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 సీట్లకు పెరిగితే 100 స్థానాల్లో తామే విజయం దక్కించుకుంటామని స్పష్టం చేశారు.
గతం బీఆర్ ఎస్.. భవిష్యత్తు కాంగ్రెస్..
“కేసీఆర్, కేటీఆర్, హరీష్రావ్.. రాసిపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం.“ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబాన్ని `కాల కూట విషం`గా అభివర్ణించారు. ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అధికారం దరిదాపుల్లోకి కూడా రాకుండా అడ్డుకుంటానని చెప్పారు.
“కొడంగల్ బిడ్డగా.. ఈ గడ్డపై నుంచే శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ కుటుంబానికి అధికారం ఉండదు“ అని రేవంత్ రెడ్డి శపథం చేశారు. బీఆర్ ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక, ముగిసిపోయినట్టేనని అన్నారు. ఆ పార్టీకి, ఆ కుటుంబానికి కూడా భవిష్యత్తు ఉండబోదని చెప్పారు. “తెలంగాణ గతం కేసీఆర్.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్“ అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్.. నువ్వెంత?
ఇదేసమయంలో బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పైనా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. “నేను మైకు ముందుకు రావట్లేదని అంటున్నాడు. దాక్కున్నానని ప్రచారం చేస్తున్నాడు“ అంటూ.. కేటీఆర్పై విమర్శలు గుప్పించారు.“నీలాగా తండ్రి పేరు చెప్పుకొని నేను బతకడం లేదు.“ అని అన్నారు.
నల్లమల నుంచి వచ్చి జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అయిన తర్వాత ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదేసమయంలో నీస్థాయి ఎంత..? అని కేటీఆర్ను నిలదీశారు. ఏపీలో చదువుకున్న నీకు తెలంగాణ గురించి ఏం తెలుసునని వ్యాఖ్యానించారు. “నీ అవ్వ.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డా, నా సంగతి మీ నాన్నని అడుగు చెప్తాడు.గాలికి తిరిగే గాలి గాడితో నాకెందుకు అని నేను మంచిగుంటున్నా.” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates