‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు’.. ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. రెండు రోజుల కిందట కూడా.. వైసీపీ నేత‌ల‌ను ముఖ్యంగా మాజీ సీఎం ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ అయ్యారు. తాజాగా మ‌రోసారి వాటికి కొన‌సాగింపుగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

“వైసీపీ నాయకులు బెదిరింపులు మానేయాలి. ప్రజాస్వామ్య భాషకు రండి. అధికారులు ఇంకా భయపడి… వారు(వైసీపీ) వస్తే ఏమవుతుందో అనుకుంటే దానికి కూడా చెబుతున్నాను. వారు రారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రావు. నా కంఠం లో ప్రాణం ఉన్నంతవరకు దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం. ఎన్ని రాజకీయ ఎత్తులు వేయడానికి అయినా నేను సిద్ధం.“ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన `పదవి బాధ్యత’ కార్య‌క్ర‌మంలో నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జ‌న‌సేన‌ నాయ‌కుల‌ను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. రాజ్యాంగ పరిధిలోనే పోరాటం చేస్తామ‌ని, చివరి దశలో మాత్రమే గొడవ పెట్టుకుంటామ‌ని చెప్పారు. “ఆ గొడవ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. చొక్కా మడిచి ముందుకు వెళతాం. అది ఆఖరి అస్త్రం. సయోధ్యగా మీరు ఎంత మాట్లాడతారో అప్పటివరకు నేను శాంతంగా ఉంటాను. మీరు కూడా చర్చ చేయండి. వాదించండి. ఆమోదయోగ్యమైన భాషలో మాట్లాడండి. సామాన్యుడు హర్షించేలా మాట్లాడండి“ అని వైసీపీకి సూచించారు.

జ‌గ‌న్ బెదిరింపులు రాష్ట్రానికి న‌ష్టం..

జ‌గ‌న్ బెదిరింపులు రాష్ట్రానికి న‌ష్ట‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దెబ్బతింటే టూరిజం కూడా దెబ్బతింటుందన్నారు. “మాజీ ముఖ్యమంత్రి వచ్చి పోలీసు అధికారుల్ని తిడుతూ… మేం వస్తే కాంట్రాక్టర్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటే చాలా తప్పుడు సంకేతం వెళ్తుంది. పర్యాటకం మీదనే కాదు… పెట్టుబడులు, అభివృద్ధి అన్ని విషయాల్లోనూ రాష్ట్రానికి న‌ష్టం చేకూరుతుంది. శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు.“ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు.