కేసీఆర్.. వీకైన ప్ర‌తిసారీ.. చంద్ర‌బాబు ఆక్సిజ‌న్‌!

రాజ‌కీయాల్లో కొంద‌రు నాయ‌కుల‌కు చిత్ర‌మైన ల‌క్ష‌ణం ఉంటుంది. వారు వీకైన ప్ర‌తిసారీ.. సెంటిమెంటును.. ప్ర‌త్య‌ర్థుల‌ను న‌మ్ముకుని ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇలాంటి వారిలో ముందున్నారు.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. గ‌తంలోను.. ప్ర‌స్తుతం కూడా ఆయ‌న త‌న బ‌లం త‌గ్గుతోంద‌ని, ప్ర‌జ‌ల్లో త‌న హ‌వా క‌నిపించ‌డం లేద‌ని భావించిన ప్ర‌తిసారీ.. ఇరు రాష్ట్రాల అంశాల‌ను… ముఖ్యంగా ఏపీని ఆయ‌న సాధ‌నంగా చేసుకుని తెలంగాణ‌లో సెంటిమెంటును ర‌గిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత‌, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబును కార్న‌ర్ చేసుకుని.. కేసీఆర్ నిచ్చెన వేసిన సంద‌ర్భాలు కూడా ఈ స‌మ‌యంలో ప్ర‌స్తావ‌నార్హం. తెలంగాణ మ‌లిద‌శ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టిన చంద్ర‌బాబు తెలంగాణ‌లో పోటీచేశారు. ఆ స‌మ‌యంలో మ‌రోసారి ఆంధ్రోళ్లు మ‌న‌పై పెత్త‌నానికి వ‌స్తున్న‌రు.. అంటూ ఊరూవాడా కేసీఆర్ ప్ర‌చారం చేశారు. ఇది ఆయ‌న‌కు లాభించి.. రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు. కానీ, 2023లో ఆ అవ‌కాశం లేకుండా పోయింది.

ఫ‌లితంగా.. కేసీఆర్ స‌ర్కారు ప‌రాజ‌యం పాలైంది. ఇక‌, అప్ప‌టి నుంచి అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా పాల‌మూరు జ‌లాల స‌మ‌స్య‌ను లేవ‌నెత్తి తద్వారా.. ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాస్త‌వానికి ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ `త‌లుచుకుని` ఉంటే.. కాళేశ్వ‌రం క‌న్నా పెద్ద ప్రాజెక్టు కాని పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తిచేసి ఉండేవారు. ఇది.. ఆయ‌న చేసిన త‌ప్పు. కానీ.. దీనిని క‌ప్పి పుచ్చుకునేందుకు 2014-18 మ‌ధ్య జ‌రిగిన సంగ‌త‌లు(అవి నిజ‌మో కాదో తెలియ‌దు) తెర‌మీదికి తెచ్చి.. చంద్ర‌బాబును ఆడిపోసుకున్నార‌న్న వాద‌న వినిపించింది.

ఇక్కడ‌ కేవ‌లం పాల‌మూరు స‌మ‌స్య మాత్ర‌మే కేసీఆర్ లేవ‌నెత్తితే..అర్థం చేసుకోవ‌చ్చు. కానీ, చంద్ర‌బాబు శిష్యుడు అంటూ.. రేవంత్ రెడ్డిని కూడా.. తెలంగాణ వ్య‌తిరేకిగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం కేసీఆర్ రాజ‌కీయ సెంటిమెంటు వ్యూహాన్ని బ‌ల‌ప‌రుస్తోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ మాట‌కు సొంత పార్టీ నాయ‌కులు విలువ ఇస్తున్నారో లేదో తెలియ‌దు. ఇక‌, కుటుంబంలో కుంప‌టి అంద‌రికీ తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా త‌న బ‌లాన్ని పెంచుకునేందుకు చంద్ర‌బాబును పావుగా చేసుకుని నీటి యుద్ధాల‌కు తెర‌దీస్తున్నారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.