జగన్ నోట ‘షర్మిలమ్మ’ మాట

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య దాదాపు అంద‌రికీ తెలిసి.. మూడున్న‌రేళ్ల‌కుపైగానే విభేదాలు కొన‌సాగుతున్నాయి. దీనికి ముందు ఎంతకాలం నుంచి వివాదాలు ఉన్నాయ‌న్న‌ది తెలియ‌దు. ష‌ర్మిల తెలంగాణ‌లో సొంత పార్టీ పెట్టుకున్న నాటి నుంచే విభేదాలు బ‌య‌ట ప్ర‌పంచానికి తెలుసు.

ఇక‌, ఆత‌ర్వాత‌.. ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి.. ఆస్తులు, వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యాల‌ను గ‌త 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేయ‌డం ద్వారా అన్నా చెల్లెళ్ల‌.. మ‌ధ్య విభేదాలు.. వివాదాలు భోగిమంట‌ల్లా రాజుకున్నాయి. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కూడా అనేక సంద‌ర్భాల్లో ష‌ర్మిల జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, జ‌గ‌న్ ఆమెపై ఎక్క‌డా ప‌ట్టించుకోలేదు.

ఇదిలావుంటే.. తాజాగా ఆదివారం(డిసెంబ‌రు 21) జ‌గ‌న్ 53వ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇరువురి మ‌ధ్య విభేదాలు నెల‌కొన్న నేప‌థ్యంలో రాఖీలు క‌ట్ట‌డం, పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం నిలిచిపోయి.. మూడేళ్ల‌యింది. ఇటీవ‌ల ష‌ర్మిల పుట్టిన రోజు జ‌రుపుకొన్నారు. కానీ, జ‌గ‌న్ స్పందించ‌లేదు. గ‌త ఏడాది జ‌గ‌న్ పుట్టిన రోజు నాడు కూడా ష‌ర్మిల స్పందించ‌లేదు. కానీ.. తాజాగా ష‌ర్మిల స్పందించారు. అయితే.. ఇక్క‌డ కూడా ఆమె ట్విస్ట్ ఇచ్చారు. జ‌గ‌న్‌కు `అన్న‌`గా కాకుండా..`వైసీపీ అధ్య‌క్షులు జ‌గ‌న్ గారికి` అని సంబోధిస్తూ.. ష‌ర్మిల శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇక‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ స‌హా సీఎం చంద్ర‌బాబు, లోకేష్ కూడా జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఇరువురు కోరుకున్నారు. ఇదిలావుంటే.. ఆదివారం సాయంత్రం.. జ‌గ‌న్ ఎక్స్‌లో స్పందించారు. త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని శుభాకాంక్ష‌లు చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాద‌లు తెలిపారు. మ‌రీ ముఖ్యంగా ష‌ర్మిల చేసిన పోస్టుకు.. “థ్యాంక్యూ ష‌ర్మిలమ్మా“ అంటూ.. వ్యాఖ్యానించారు. కాగా.. ఇలా ఇరువురి మ‌ధ్య మ‌ళ్లీ బంధం విల‌సిల్లితే మంచిదే. ఏ కుటుంబంలో అయినా.. క‌లిసి ఉండాల‌నే అంద‌రూ కోరుకుంటారు.

రాజ‌కీయ విభేదాల వ‌ర‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ.. తాజాగా వెలుగు చూసింది ఏంటంటే.. ఇరువురి మాతృమూర్తి విజ‌య‌మ్మ ప్రోత్సాహంతోనే.. అటు ష‌ర్మిల‌, ఇటు జ‌గ‌న్‌లు స్పందించార‌ని వైసీపీలో టాక్ న‌డుస్తోంది. ఆది నుంచి విజ‌యమ్మ ఇరువురి విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక సంద‌ర్భంలో ఎన్ని విభేదాలు ఉన్నా.. కొడుకు కొడుకు కాకుండా పోతాడా! అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. సో.. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో అన్నాచెల్లెళ్ల‌ను క‌లిపే ప్ర‌య‌త్నం చేసి ఉంటార‌ని వైసీపీ నాయకులు అంచ‌నా వేస్తున్నారు.